ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బెంగళూరులో ఒకే వేదికపై కలుసుకోవడం తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు. కేటీఆర్, జగన్ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడంతో ఫంక్షన్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మొన్నటికి మొన్న వైయస్ జగన్ హైదరాబాదులో కోర్టుకు హాజరైనప్పుడు ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. అందులో కేటీఆర్, జగన్ ఫోటోలు కలిపి ప్రదర్శించడం రాజకీ య వర్గాల్లో చర్చ జరిగింది. మొదటినుంచి బీఆర్ఎస్, వైసీపీ పలు అంశాలపై సానుకూలంగా ఉంటున్నాయి. ఏపీలో జగన్ ప్రభుత్వం ఉన్నపుడు, అక్కడ కేసీఆర్ సీఎంగా ఉన్నారు. గత తెలంగాణా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇద్దరి మధ్య లోపాయికారీ సంబంధం ఉందనే ఊహాగానాలు వినిపించాయి.
ఓటమి తర్వాత అటు కేటీఆర్, ఇటు జగన్ కూడా అధికార పక్షం నుంచి రాజకీయంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో వారిద్దరి ఏమి చర్చ జరిగి ఉంటుంది అనే ఆసక్తి నెలకొంది. కొద్దిరోజుల కిందట తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ హైదరాబాదులో ఒక ఫంక్షన్ లో ఇటువంటి ఫ్రేమ్ లోనే కనిపించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన ఇద్దరు నేతలు ఇలా కనిపించడం కూడా కొంత ఆసక్తిగా మారింది.
వీరి కలయిక తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. వీరిద్దరి భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని, రాజకీయాలకు సంబంధం లేదని ఇరు పార్టీల వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.