అసలే సంక్రాంతి పోటీ తీవ్రంగా ఉంది. పైగా భగవంత్ కేసరి రీమేక్ అనే ప్రచారం. ఎంత విజయ్ హీరో అయినా తెలుగు వరకు జన నాయకుడు మీద విపరీతమైన బజ్ లేదన్నది వాస్తవం. అయినా సరే తన స్టార్ పవర్ ఇక్కడ ఓపెనింగ్స్ తో పాటు వసూళ్లను తెస్తుందనే ధీమాతో హక్కుల కోసం పెద్ద చేతులే పోటీ పడుతున్నట్టు ఇన్ సైడ్ టాక్. నిర్మాత నాగవంశీ ముందు వరసలో ఉన్నట్టు సుమారు తొమ్మిది కోట్లకు డీల్ చేసుకున్నట్టు ట్రేడ్ వర్గాల్లో టాక్ ఉంది. అడ్వాన్స్ బేసిస్ కావడంతో ఒకవేళ ఫలితం అటుఇటు అయినా ఒరిజినల్ ప్రొడ్యూసర్ కు రిస్క్ ఉంటుంది. కొన్ని ఏరియాలు ధీరజ్ మొగిలిలేని లాంటి వాళ్ళు తీసుకుంటున్నారట.
ఇది నిజమైతే థియేటర్ల పరంగా పెద్ద చిక్కే వచ్చి పడుతుంది. ఎందుకంటే జనవరి 9 రాజా సాబ్ కూడా వస్తుంది. దానికున్న హైప్ కి అన్ని సెంటర్లలో అన్ని స్క్రీన్లు వేసుకున్నా చాలవు. బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందా ప్రభాస్ ని ఆపడం కష్టం. అదే జరిగితే జన నాయకుడు ఆ తాకిడిని తట్టుకోలేడు. ఇంకో రెండు రోజులు ఆలస్యం మన శంకరవరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారి నారి నడుమ మురారి, అనగనగా ఒక రాజు, పరాశక్తి క్యూ కట్టి వచ్చేస్తాయి. ఒక అయిదారు స్క్రీన్లు మాత్రమే అందుబాటులో ఉండే కొన్ని బిసి సెంటర్లలో షోలు సర్దుబాటు చేయడం డిస్ట్రిబ్యూటర్లకు నరకప్రాయంగా ఉంటుంది.
జన నాయకుడు ఇంకా పూర్తి స్థాయి ప్రమోషన్లు మొదలుపెట్టలేదు. ఇటీవలే తమిళ్ లో ఫస్ట్ ఆడియో సింగల్ వచ్చింది. అనిరుద్ రవిచందర్ స్టైల్ లో బాగానే ఉందన్నారు కానీ ఆశించిన స్థాయిలో వైరల్ కాలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలా వద్దా అనే మీమాంస టీమ్ లో ఉందట. రాజకీయంగా విజయ్ కు అధికార పార్టీ నుంచి ఇబ్బందులు వస్తాయని అభిమానులు అనుమాన పడుతున్నారు. మన దగ్గర అలాంటి సమస్య లేదు కానీ థియేటర్ల పంచాయితీ అయితే ఖచ్చితంగా వస్తుంది. హెచ్ వినోత్ దర్శకత్వం వహించిన జన నాయకుడులో పూజా హెగ్డే హీరోయిన్ కాగా మమిత బైజు ఒక ముఖ్యమైన పాత్ర చేసింది.