జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ, జల బిరాదరి సంఘం జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ పార్టీ బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు లేఖ రాసి తన నిర్ణయాన్ని తెలియజేశారు. ఉత్తరాంధ్రలో పారిశ్రామిక కాలుష్యం, మురుగునీటి సమస్యలపై 2020లో తాను హైకోర్టులో దాఖలు చేసిన పిల్ (248/2020) నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన లేఖలో వివరించారు.
ప్రస్తుతం ఏపీ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో, అదే శాఖ ప్రతివాదిగా ఉన్న కేసులో తాను పిటిషనర్గా కొనసాగడం వల్ల నైతిక ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో పార్టీ బాధ్యతలకు దూరంగా ఉంటున్నట్లు బొలిశెట్టి తెలిపారు.
న్యాయ ప్రక్రియ నిష్పక్షపాతంగా సాగేందుకు, కూటమికి ఎలాంటి రాజకీయ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. పిల్పై తుది తీర్పు వచ్చే వరకు పార్టీ పదవులకు దూరంగా ఉంటానని, అయితే పర్యావరణ పరిరక్షణ కోసం తన న్యాయ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.
జనసేన పార్టీ పదవుల నుంచి తప్పుకున్నప్పటికీ, పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలకు తాను కట్టుబడి ఉంటానని బొలిశెట్టి సత్యనారాయణ వెల్లడించారు. డాక్టర్ రాజేంద్ర సింగ్, ఎంవీఆర్ శాస్త్రి తదితరులతో కలిసి నదులు, జల వనరుల రక్షణ కోసం చేపడుతున్న ‘మన నుడి–మన నది’ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. తన నిర్ణయాన్ని ఆయన ఒక ‘నైతిక విరామం’గా అభివర్ణిస్తూ, ఇది రాజకీయాల్లో పారదర్శకతకు, పర్యావరణ హితానికి నిదర్శనమని పేర్కొన్నారు.
పర్యావరణ న్యాయం కోసం తన పర్యావర ప్రధాన కార్యదర్శి పదవి నుండి ఇతర అనుబంధ పదవుల నుండి బయటకు వస్తున్నాను ఎందుకు?ఆంధ్రప్రదేశ్లో కాలుష్యానికి సంబంధించి దాఖలైన ఒక ప్రధాన పర్యావరణ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL 248/2020)లో నేను పిటిషనర్గా ఉన్నాను. ఈ నేపథ్యంలో నేను “నైతిక విరామం”… pic.twitter.com/Vsa5MtAOYf— Bolisetty Satyanarayana (@bolisetti_satya) February 3, 2026