తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పార్వేట ఉత్సవం తిరుమలలో అత్యంత ఘనంగా జరిగింది. గోదా పరిణయోత్సవం కూడా కన్నుల పండువగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని ఆండాళ్ శ్రీ గోదాదేవి చెంత నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి. ఈ మాలలను శ్రీవారి మూల మూర్తికి అందంగా అలంకరించారు. స్వామి వారికి ప్రాతః కాలారాధన పూర్తి అయిన తరువాత శ్రీ మలయప్ప స్వామివారు తిరుచ్చిలో వేంచేసారు. వారి వెంటనే మరో తిరుచ్చిపై శ్రీ కృష్ణస్వామి వేంచేసారు. అనంతరం పార్వేట మండపమునకు వెళ్ళి, ఆ మండపం నందు పుణ్యాహము జరిగిన పిమ్మట మంచెలో వేంచేసారు. శ్రీస్వామివారికి ఆరాధన, నివేదన చేపట్టారు. అనంతరం స్వామి వారికి హారతులు చేపట్టారు.
ఇక శ్రీకృష్టస్వామి వారిని మాత్రం సన్నిధి గొల్లపూజ చేసిన చోటుకు వేంచేపుచేసి పాలువెన్న ఆరగింపు అయి హారతి జరిగిన పిమ్మట శ్రీమలయప్ప స్వామివారి సన్నిధికి వెళ్ళారు. తరువాత యాదవ భక్తుడు సమర్పించిన పాలు వెన్న శ్రీమలయప్ప స్వామివారికి నివేదనం హారతి అయి గొల్లకు బహుమానం జరిగింది. తరువాత శ్రీమలయప్పస్వామివారు ముందునకు కొంత దూరము పరుగెత్తి వారి తరపున అర్చకులు ఈటె వేసిన పిమ్మట వెనుకకు వచ్చారు. ఇట్లు మూడుసార్లు జరిగింది. స్వామివారి వేటను తిలకించడానికి పారువేట మండపానికి విశేషంగా భక్తులు విచ్చేసారు. శ్రీమలయప్ప స్వామివారు ఉత్సవంం పూర్తియి మహాద్వారమునకు వచ్చి హతీరాంజీవారి బెత్తమును తీసుకొని సన్నిధిలోనికి వేంచేసారు. ఇంతటితో ఎంతో వేడుకగా జరిగే పారువేట ఉత్సవము ఘనంగా ముగిసింది.
ఈ ఉత్సవంలో టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
The post తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం
Categories: