టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు.. ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆశించిన విజయాలు అందుకోలేదు. సక్సెస్ రేట్ పడిపోయింది. గత రెండేళ్లలో భారీ చిత్రమైన ‘గేమ్ చేంజర్’తో పాటు ఫ్యామిలీ స్టార్, తమ్ముడు లాంటి మిడ్ రేంజ్ మూవీస్ కూడా ఆయన్ని దారుణంగా దెబ్బ కొట్టాయి.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా లేకపోయి ఉంటే ఆ సంస్థ మనుగడే ప్రశ్నార్థకం అయ్యేది. అయితే ఈ ఏడాదిని దిల్ రాజు ఘనంగా ఆరంభించారు. సంక్రాంతికి ఆయన జాక్ పాట్ కొట్టారు.
ఈ పండక్కి రాజు ప్రొడ్యూస్ చేసిన చిత్రాలు ఏవీ విడుదల కాలేదు కానీ.. ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన చిత్రాలు మాత్రం మూడు రిలీజ్ అయ్యాయి. ఆ మూడూ బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టేస్తున్నాయి. సంక్రాంతికి ఐదు చిత్రాలు రిలీజ్ కాగా.. అందులో రాజు పంపిణీ చేసిన మన శంకర వరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి బ్లాక్ బస్టర్ విజయం దిశగా దూసుకెళ్తున్నాయి.
రాజుకు సంబంధం లేని రాజాసాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలు ఒక మాదిరిగా ఆడుతుండగా.. మిగతా మూడు బాక్సాఫీస్ ను దున్నేస్తున్నాయి.
చిరంజీవి, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ చిత్రాలను నైజాం, వైజాగ్ ఏరియాల్లో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయగా.. ప్రతిచోటా వసూళ్ల మోత మోగుతోంది. ఇప్పటికే ఈ చిత్రాలు బ్రేక్ ఈవెన్ కు వచ్చేశాయి. లాభాల బాట పట్టేశాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంక్రాంతి సినిమాలకు ఎప్పుడూ మంచి వసూళ్లే వస్తాయి.
కానీ ఈ పండక్కి కలెక్షన్లు వేరే స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా చిరు సినిమా అయితే ఎవ్వరూ ఊహించని రేంజిలో వసూళ్ళు వస్తున్నాయి. దిల్ రాజు ఈ ఒక్క సినిమాతోనే భారీ లాభాలు అందుకుంటున్నారు. మిగతా రెండు చిత్రాలతోనూ ఆయనకు గట్టిగానే లాభం రాబోతోంది. మొత్తంగా ఈ పండక్కి ఆయన జాక్ పాట్ కొట్టినట్లే.