ఒకప్పుడు వరుసగా డజనుకు పైగా ఫ్లాపులు ఎదుర్కొని.. ఆ స్ట్రీక్ నుంచి బయటికి వచ్చి ‘ఇష్క్’తో హిట్టు కొట్టాడు నితిన్. ఆ తర్వాత కొన్నేళ్లు తన కెరీర్ బాగానే సాగింది. కానీ 2020లో భీష్మతో సక్సెస్ అందుకున్నాక కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఐదేళ్లుగా అతడికి హిట్టు లేదు. వరుసగా అరడజను ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. ఈ ఏడాది ‘తమ్ముడు’తో భారీ డిజాస్టర్ను ఖాతాలో వేసుకున్నాక నితిన్ డోలాయమానంలో పడిపోయాడు.
ఆల్రెడీ కమిటైన ‘యల్లమ్మ’ సినిమా నుంచి కూడా తప్పుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. నితినే ఆ సినిమాను వద్దనుకున్నాడా.. లేక ‘తమ్ముడు’ అనుభవం నేపథ్యంలో నిర్మాతే దిల్ రాజే తప్పించాడా అన్నది క్లారిటీ లేదు. ఆ తర్వాత నితిన్ హీరోగా ‘ఇష్క్’ దర్శకుడు విక్రమ్ కుమార్ ఓ సినిమా తీయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని తర్వాత తేలింది. ఈలోపు శ్రీను వైట్ల, నితిన్ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. చివరికి అదీ కార్యరూపం దాల్చలేదు.
ఐతే ఎట్టకేలకు నితిన్ కొత్త సినిమా ఖరారైనట్లు సమాచారం. విలక్షణ చిత్రాలకు పెట్టింది పేరైన వీఐ ఆనంద్.. నితిన్ హీరోగా సినిమా తీయబోతున్నాడు. ది వారియర్, స్కంద, నా సామిరంగ లాంటి చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారట. తమిళ దర్శకుడైన వీఐ ఆనంద్.. అక్కడ ‘అప్పూచ్చి గ్రామం’ అనే వెరైటీ సినిమా తీసి పేరు సంపాదించాడు. తర్వాత అతడి మకాం టాలీవుడ్కు మారిపోయింది.
టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం, ఊరు పేరు భైరవకోన లాంటి సినిమాలు తీశాడు ఆనంద్. వీటిలో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ పెద్ద హిట్టయింది. ‘ఒక్క క్షణం’ ఫ్లాప్ అయింది. మిగతా రెండు చిత్రాలు ఓ మోస్తరుగా ఆడాయి. నితిన్తో ఆనంద్.. సైన్స్ ఫిక్షన్ మూవీ చేయబోతున్నాడని.. ఇందులో నితిన్ ద్విపాత్రాభినయం చేస్తాడని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి అనౌన్స్మెంట్ రాబోతున్నట్లు తెలుస్తోంది.