hyderabadupdates.com movies పర్సనల్ పంచాయతీలు పవన్ దాకా వద్దు

పర్సనల్ పంచాయతీలు పవన్ దాకా వద్దు

ఇటీవల కాలంలో వివాదాలకు కేంద్రంగా నిలిచిన పలువురు జనసేన పార్టీ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్లని నేరుగా నొప్పించకుండా.. అలాగని పార్టీకి నష్టం కలిగితే చూస్తూ ఊరుకునేది లేదన్నట్టుగా.. ఆయన చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

“ఏ నాయకుడైనా ఏ ప్రజా ప్రతినిధి అయినా వ్యక్తిగతంగా వారు చేసే పనుల వల్ల పార్టీకి ఇబ్బందులు రావడానికి వీల్లేదు.“ అని తేల్చి చెప్పారు. అంతేకాదు ప్రజా ప్రతినిధుల భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.

తద్వారా ప్రస్తుతం వివాదాలకు ఆస్కారం ఇస్తున్న నాయకులకు వచ్చే ఎన్నికల్లో భవిష్యత్తు ఎలా ఉంటుందన్న విషయాన్ని పరోక్షంగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడలో బుధవారం జరిగిన పార్టీ కీలక సమావేశంలో అనేక విషయాలను పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ప్రధానంగా పార్టీ క్రమశిక్షణ పై సుమారు అరగంట సేపు మాట్లాడినట్టు తెలిసింది. అత్యంత గోప్యంగా ఈ సమావేశాన్ని నిర్వహించటం విశేషం. ఈ సమావేశానికి కేవలం పార్టీ ప్రజా ప్రతినిధులను మాత్రమే అనుమతించారు. ఇతర నాయకులను సైతం సమావేశానికి అనుమతించలేదు.

ఇక ఈ సమావేశంలో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి కుటుంబ సభ్యులు చేస్తున్న రాజకీయ అంశాలను కూడా చర్చించారు. “కుటుంబ సభ్యులను ఎంతవరకు రాజకీయాలకు వాడుకోవాలో మీరే ఆలోచించుకోండి.“ అని చెప్పడం ద్వారా ఒకరకంగా వారిని హెచ్చరించినట్టే అయింది. ఉమ్మడి విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం.. అదే విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రెండు ముఖ్య నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు `రాజకీయాలు` చేయడం, వివాదాలకు గురికావడం వంటివి ఇటీవల ప్రముఖంగా చర్చనీయాంశమయ్యాయి.

ఈ విషయాలను ప్రస్తావించిన పవన్ కళ్యాణ్.. కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి ఏ మేరకు ఉపయోగించుకుంటారు.. ఏ విధంగా వారిని అనుమతిస్తారు.. అనేది నాయకులు లోతుగా ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. తద్వారా నాయకులు క్రమశిక్షణ తప్పితే ఊరుకునేది లేదన్న విషయాన్ని పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఇక, కూటమి పార్టీలు కలిసి ఉండాలన్న విషయాన్ని మరోసారి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో కూటమి పార్టీలను కలుపుకుని వెళ్లే విషయంలో జనసేన తరపున ఏ చిన్న లోటు వచ్చినా సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

అంతేకాదు, చిన్న చిన్న లోటుపాట్లు.. తేడాలు.. విభేదాలు.. వంటివి ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నట్టుగానే కూటమి పార్టీల మధ్య కూడా ఉంటాయని, అయినా సర్దుకుని పోవాల్సిందేనని దిశా నిర్దేశం చేశారు. ఈ విషయంలో జనసేన పార్టీ తరఫున అందరూ కలిసి ముందుకు సాగాల్సిందేనని స్పష్టం చేశారు.

ఇక త్వరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు జరగనున్నాయని, వాటిలో కూటమి పార్టీల విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని తేల్చి చెప్పారు. అదేవిధంగా పార్టీ సభ్యత్వాలను మరింత పెంచాలని కూడా సూచించారు. మొత్తంగా సుమారు 6 గంటల పాటు జరిగిన ఈ సమావేశం నాయకుల లోటుపాట్లతోపాటు క్షేత్రస్థాయిలో జరుగుతున్న అనేక అంశాలను ప్రస్తావించడం ద్వారా భవిష్యత్తులో పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయాన్ని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Related Post

Anaganaga Oka Raju Review:  Naveen Polishetty Kills It Yet Again With His Fun GagsAnaganaga Oka Raju Review:  Naveen Polishetty Kills It Yet Again With His Fun Gags

Anaganaga Oka Raju is a 2026 Telugu-language romantic comedy and village drama written and directed by Maari. The film has Naveen Polishetty & Meenakshi Chaudhary playing the lead roles, while