ఒకప్పుడు వేరే బేనర్ల భాగస్వామ్యంలో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు తీస్తుండేది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ. గూఢచారి, రాజరాజ చోర, కార్తికేయ-2 లాంటి విజయాలతో ఆ సంస్థ ప్రయాణం బాగానే సాగుతుండేది. తర్వాత తన బేనర్ మీద సొంతంగా సినిమాలు నిర్మించడం మొదలుపెట్టారు నిర్మాత విశ్వప్రసాద్. దీంతో ఆ సంస్థ సినిమాల రేంజ్ మారింది. అలాగే క్వాంటిటీ కూడా పెరిగిపోయింది.
ఒకేసారి రెండంకెల సంఖ్యలో సినిమాలను సెట్స్ మీదికి తీసుకెళ్లే స్థాయికి చేరుకుంది పీఎంఎఫ్ సంస్థ. అలా టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్ బేనర్లలో ఒకటిగా అది ఎదిగింది. కానీ సినిమాల నంబర్ పెరిగింది కానీ.. సక్సెస్ మాత్రం పడిపోయింది. ధమాకా, మిరాయ్ తప్పితే గత నాలుగేళ్లలో ఆ సంస్థ నుంచి ఒక్క సక్సెస్ కూడా లేదు.
రామబాణం, ఈగల్, మిస్టర్ బచ్చన్, శ్వాగ్, విశ్వం, బ్రో, మనమే, తెలుసు కదా, మౌగ్లీ.. ఇలా పీఎంఎఫ్ బేనర్లో ఫ్లాపుల జాబితా చాలా పెద్దదే.
ఐతే ఇలా వరుసగా ఫ్లాపులు వస్తుండడంతో సోషల్ మీడియాలో పీఎంఎఫ్ మీద విమర్శలు ఊపందుకుని.. మీమ్స్ కూడా పడ్డాయి. ‘అరుణాచలం’ సినిమాలో రజినీకాంత్ లాగా కావాలని విశ్వప్రసాద్ డబ్బులు ఖర్చు పెట్టే ఛాలెంజ్ ఏమైనా తీసుకున్నారా అంటూ కౌంటర్లు కూడా వేశారు. దీని మీద స్వయంగా విశ్వప్రసాద్ ఒక ఈవెంట్ లో స్పందించారు కూడా.
ఆ టైంలో ఆయన మాట్లాడుతూ.. తమ సంస్థలో వచ్చిన నష్టాలన్నింటినీ ‘రాజాసాబ్’ సినిమా భర్తీ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిజానికి ప్రభాస్ పీఎంఎఫ్ బేనర్లో సినిమా చేయడానికి ‘ఆదిపురుష్’ సినిమా ఒక కారణం. ఆ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విశ్వప్రసాదే రిలీజ్ చేశారు. ప్రభాస్ కోసమని భారీ రేటు పెట్టి సినిమాను విడుదల చేస్తే అది భారీ నష్టాలు మిగిల్చింది.
ఈ నేపథ్యంలోనే విశ్వప్రసాద్కు డేట్లు ఇచ్చి ‘రాజాసాబ్’ సినిమా చేశాడన్నది ఇండస్ట్రీలో ఒక టాక్. ‘ఆదిపురుష్’ నష్టాలతో పాటు మిగతా చిత్రాల లాస్లను కూడా ‘రాజాసాబ్’ కవర్ చేస్తుందని విశ్వప్రసాద్ ధీమాతో ఉంటే.. అది జరగకపోగా కొత్త నష్టాలు తెచ్చిపెట్టిందీ చిత్రం. మరి దీన్నుంచి విశ్వప్రసాద్ ఎలా కోలుకుంటారో చూడాలి.
ప్రభాస్ కొత్త చిత్రం ‘స్పిరిట్’ను కూడా విశ్వప్రసాదే తెలుగులో రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో ఆ సినిమా అయినా ఆయనకు కోరుకున్న ఫలితాన్నిస్తుందేమో చూడాలి.