ఇటీవలే భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఆ విజయం జట్టులో ప్రతి ఒక్కరినీ అమితానందానికి గురి చేసింది. ఈ గెలుపు సంబరాల్లో మునిగి తేలిన కొన్ని రోజులకే ఓపెనర్ స్మృతి మంధాన పెళ్లి. కొన్నేళ్లుగా తాను డేటింగ్ చేస్తున్న పలాష్ ముచ్చల్ను ప్రపంచకప్ గెలిచిన ఇదే నెలలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది స్మృతి. ఈ పెళ్లికి ఆమె సహచర క్రికెటర్లూ హాజరయ్యారు. వారితో కలిసి పెళ్లి వేడుకల్లో స్మృతి చేసిన సందడి అంతా ఇంతా కాదు.
హల్దీ, మెహందీ, సంగీత్.. ఇలా రకరకాల వేడుకల్లో వీరి ఉత్సాహం మామూలుగా లేదు. మరి కొన్ని గంటల్లో నచ్చిన వాడిని పెళ్లి చేసుకోబోతున్నందుకు స్మృతి ఎంత సంతోషించి ఉంటుందో. కానీ అంతలో అనుకోని పరిణామం. స్మృతి తండ్రి శ్రీనివాస్ గుండెపోటుకు గురయ్యాడు. పెళ్లి వేదికలోనే ఈ హఠాత్పరిణామం చేసుచేసుకోవడంతో వివాహాన్ని ఆపేయాల్సి వచ్చింది. ఆయన ఐసీయూలో చేరడంతో పెళ్లిని నిరవధికంగా వాయిదా వేశారు.
మహారాష్ట్రలోని సంగ్లిలో ఉన్న స్మృతి మంధాన ఫామ్ హౌస్లో ఆదివారం స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ల పెళ్లి జరగాల్సిది. పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం రాత్రి ఏర్పాటు చేసిన సంగీత్లో స్మృతి, ముచ్చల్ల జంట డ్యాన్స్తో అదరగొట్టింది. ఇందులో జెమీమా రోడ్రిగ్స్, రాధ యాదవ్, అరుంధతి రెడ్డి సహా పలువురు భారత క్రికెటర్లు సందడి చేశౄరు. వీరి డ్యాన్స్ వీడియోలు వైరల్ అయ్యాయి. ఐతే ఆదివారం ఉదయం అందరూ పెళ్లి కోసం సిద్ధమవుతుండగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన అనారోగ్యానికి గురయ్యారు.ఉదయం అల్పాహారం తర్వాత ఆయనకు గుండెపోటు వచ్చింది. కుటుంబసభ్యులు హుటాహుటిన శ్రీనివాస్ను సంగ్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తడ్రి ఆసుపత్రి పాలవడంతో స్మృతి పెళ్లి ఆగిపోయింది. ఆయన కోలుకోవడాన్ని బట్టి పెళ్లి ఎప్పుడు అన్నది నిర్ణయిస్తారు. సంగీత దర్శకుడైన పలాష్ ప్రస్తుతం ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తున్నాడు. సినిమాల్లోనూ ప్రయత్నిస్తున్నాడు. స్మృతితో అతను మూడేళ్లుగా ప్రేమలో ఉన్నాడు