రోటీన్ కు భిన్నంగా ప్లాన్ చేసేవి ఏవైనా సక్సెస్ సాధిస్తుంటాయి. ఈ మధ్యన తన బిల్డింగ్ ను అమ్మకానికి పెట్టిన ఒక పెద్ద మనిషి.. దానికి సరైన రేటు రాని నేపథ్యంలో.. లక్కీ డ్రా పేరుతో చేసిన ప్రయత్నం సక్సెస్ కావటమే కాదు.. అనుకున్న దాని కంటే ఎక్కువే డబ్బులు చేతికి వచ్చిన పరిస్థితి. ఈ ఉదంతాన్ని స్ఫూర్తిగా తీసుకున్న మరొకరు ఇదే తీరును ఫాలో అయి.. ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నారు.
110 గజాల తన ఇంటి విలువ రూ.18 లక్షలుగా లెక్కేసిన ఒకరు రూ.6వేలకు ఒక టికెట్ చొప్పున డిసైడ్ చేసి.. కరపత్రాలతో ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు.. కేవలం 300 మందికి మాత్రమే అమ్ముతామని కండీషన్ పెట్టటంతో.. పోతే రూ.6వేలు.. వస్తే ఒక ఇల్లు అన్నదిప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్ లో ఈ లక్కీ డ్రాను నిర్వహిస్తున్నారు.
లక్కీ డ్రాలో బంపర్ ప్రైజ్ గా రూ.18 లక్షలు చేసే ఇంటిని.. మరో 30 మందికి ఇంటికి ఉపయోగపడే వస్తువుల్ని బహుమతులుగా పెట్టారు. అయితే.. చట్టప్రకారం మాత్రం లక్కీ డ్రాలు నిర్వహించటం నేరం. దీంతో.. ఈ లక్కీ డ్రాను నమ్మొద్దంటూ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
అంతేకాదు.. ఈ ఉదంతంపై విచారణ జరిపి కేసు కడతామని హెచ్చరిస్తున్నారు. మోర్తాడ్ లక్కీడ్రా అంశంపై విచారణ చేస్తున్నామని.. ప్రజలు ఇలాంటి వాటిని నమ్మొద్దని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.