వేలంటైన్స్ డే వీకెండ్లో మూడు పేరున్న సినిమాలు రిలీజ్ కాగా.. ఫంకీ, సీతాపయనం వారాంతానికల్లా వాషౌట్ అయిపోయాయి. కపుల్ ఫ్రెండ్లీకి మంచి టాక్ వచ్చింది. వీకెండ్ వసూళ్లు బాగున్నా.. తర్వాత జనం లేక ఇబ్బంది పడింది. మంచి సినిమా థియేటర్లలో ఉన్నా జనం చూడట్లేదని.. సినీ ప్రియులు బాధ పడ్డారు.
ఐతే వీక్ డేస్లో డల్లుగా నడిచినా.. వీకెండ్లో కపుల్ ఫ్రెండ్లీ పుంజుకుంది. జనం ఎగబడి ఈ సినిమాను చూడలేదు కానీ.. వారాంతపు వసూళ్లు ఆశాజనకంగానే కనిపించాయి. ఈ వారం విడుదలైన హే బల్వంత్.. తొలి రోజు కొంత సందడి చేసి, తర్వాత వీక్ అయిపోయింది. దాంతో పోలిస్తే శని, ఆదివారాల్లో కపుల్ ఫ్రెండ్లీ సినిమాకే మెరుగైన ఆక్యుపెన్సీలు వచ్చాయి. శనివారం, ఎనిమిదో రోజు కపుల్ ఫ్రెండ్లీ వసూళ్లు.. డే-1 కలెక్షన్ల కంటే ఎక్కువ ఉన్నాయన్నది ట్రేడ్ వర్గాల మాట.
సంక్రాంతి సీజన్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ బాగా డల్ అయిపోయింది. ఏ సినిమా కూడా థియేటర్లలో సందడి తీసుకురాలేకపోయింది. ప్రతి వారం వచ్చే సినిమాల మీద ట్రేడ్ ఆశలు పెట్టుకోవడం.. థియేటర్లలో మాత్రం జనం లేకపోవడం.. ఇదే వరస. కొన్ని చిత్రాలకు ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ వస్తున్నా.. వీకెండ్ తర్వాత థియేటర్లు ఖాళీ అయిపోతున్నాయి.
ఐతే కపుల్ ఫ్రెండ్లీ మాత్రం ఉన్నంతలో కొంచెం మెరుగ్గా పెర్ఫామ్ చేస్తోంది. వీకెండ్ తర్వాత ప్రభాస్తో కలిసి కపుల్ ఫ్రెండ్లీ టీం చేసిన చిట్ చాట్ ఇంటర్వ్యూ సినిమాకు ప్లస్ అయింది. ప్రభాస్ గురించే కాక సినిమా గురించి కూడా జనం మాట్లాడుకున్నారు. సోషల్ మీడియాలో ఈ ఇంటర్వ్యూ బాగా ట్రెండ్ అయింది.
సినిమాలో కూడా విషయం ఉండడంతో వీకెండ్లో బాక్సాఫీస్ దగ్గర కపుల్ ఫ్రెండ్లీ పుంజుకుంది. తమిళ దర్శకుడైన అశ్విన్ చంద్రశేఖర్ రూపొందించిన ఈ చిత్రంలో సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించారు. యువి క్రియేషన్స్ ఈ మూవీని నిర్మించింది.