కమెడియన్ టర్న్డ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ సినిమాలు తీసినా తీయకపోయినా.. ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంటాడు. ఒక దశలో వరుసబెట్టి పెద్ద పెద్ద సినిమాలు తీసిన బండ్ల.. 2015లో వచ్చిన ‘టెంపర్’ తర్వాత సైలెంట్ అయిపోయాడు. మళ్లీ ప్రొడక్షన్లోకి రావాలని ప్రయత్నిస్తున్నా కుదరడం లేదు. అలా అని ఆయనేమీ సినీ రంగానికి దూరం అయిపోలేదు. ఫిలిం ఈవెంట్లలో పాల్గొంటూ మంటలు పుట్టించే మాటలతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. గత నెల ‘లిటిల్ హార్ట్స్’ సక్సెస్ మీట్లో బండ్ల కామెంట్స్ ఎంత చర్చనీయాంశం అయ్యాయో తెలిసిందే. ఇప్పుడు మరోసారి బండ్ల వార్తల్లో వ్యక్తిగా మారాడు.
షాద్ నగర్లోని తన ఇంట్లో భారీ ఎత్తున దీపావళి విందు ఏర్పాటు చేసిన బండ్ల.. టాలీవుడ్ నుంచి బోలెడంతమంది సెలబ్రెటీలను ఆ పార్టీకి రప్పించి అందరి చూపూ తన మీద పడేలా చేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్.. ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది టాప్ సెలబ్రెటీలను ఈ పార్టీకి వచ్చేలా చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏదో పెళ్లి రిసెప్షన్ లాంటి వేడుకలకు, అది కూడా సిటీలో జరిగితే సెలబ్రెటీలు పెద్ద ఎత్తున రావడం మామూలే.
కానీ షాద్ నగర్ వరకు వెళ్లి బండ్ల ఇంట్లో జరిగిన దీపావళి పార్టీలో ఇంతమంది సెలబ్రెటీలు పాల్గొనడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ పార్టీలో ఒక్కో ప్లేట్ డిన్నర్ ఖరీదు రూ.15 వేలట. కేవలం ఫుడ్, బేవరేజెస్ కోసమే కోటిన్నర దాకా ఖర్చు పెట్టాడట బండ్ల. మిగతా ఏర్పాట్లు కూడా కలిపితే లెక్క రూ.2 కోట్లకు పైమాటే అంటున్నారు. ఈ బడ్జెట్లో ఒక చిన్న సినిమా తీసేయొచ్చు.
మరి దశాబ్ద కాలంగా ప్రొడక్షన్కు దూరంగా ఉన్న బండ్ల.. ఈ స్థాయిలో ఖర్చు పెట్టి ఈ పార్టీ ఎందుకిచ్చాడు అన్నది చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే ఆయన ఓ పెద్ద సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడని.. తన ఇద్దరు కొడుకులను కూడా హీరోలను చేయాలనుకుంటున్నాడని.. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీ ప్రముఖులు, మీడియా సహకారం కోసమే ఈ భారీ పార్టీ ఏర్పాటు చేశాడని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.