ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు భారత్ వైపే ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ పరిణామాల మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియాకు వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఆహ్వానం మేరకు డిసెంబర్ 4, 5 తేదీల్లో ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని మన విదేశాంగ శాఖతో పాటు రష్యా క్రెమ్లిన్ వర్గాలు కూడా అధికారికంగా ధృవీకరించాయి.
ఇది కేవలం సాధారణ పర్యటన కాదు. భారత్ రష్యా మధ్య జరగబోయే 23వ వార్షిక సదస్సు కోసం పుతిన్ వస్తున్నారు. ప్రతి ఏటా రెండు దేశాల అధినేతలు కలుసుకోవడం, ద్వైపాక్షిక సంబంధాలను చర్చించుకోవడం ఆనవాయితీ. ఈసారి ఢిల్లీ వేదికగా ఈ మెగా ఈవెంట్ జరుగుతోంది. ప్రపంచం ఎన్ని ఆంక్షలు పెట్టినా, రష్యాతో భారత్ స్నేహ బంధం ఎంత గట్టిగా ఉందో చెప్పడానికి ఈ పర్యటనే నిదర్శనం అని విశ్లేషకులు అంటున్నారు.
ఈ పర్యటనలో ప్రధాని మోదీ, పుతిన్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. ఇద్దరు నాయకులు ముఖాముఖిగా కూర్చుని రెండు దేశాల సంబంధాలను సమీక్షించుకోనున్నారు. ముఖ్యంగా మన దేశానికి, రష్యాకు మధ్య ఉన్న ‘స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్’ను మరింత బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. రక్షణ రంగం, వాణిజ్యం, ఇంధన అవసరాల గురించి పలు కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.
పుతిన్ షెడ్యూల్ చాలా బిజీగా ఉండబోతోంది. మోదీతో చర్చల తర్వాత, భారత రాష్ట్రపతిని కూడా ఆయన మర్యాదపూర్వకంగా కలవనున్నారు. పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్లో ప్రత్యేక విందు కూడా ఏర్పాటు చేస్తున్నారు. చాలా కాలం తర్వాత రష్యా అధినేత భారత గడ్డపై అడుగుపెడుతుండటంతో ఘన స్వాగతం పలకడానికి కేంద్రం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
ఈ పర్యటనపై అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ముఖ్యంగా అమెరికా, చైనా వంటి దేశాలు ముందు నుంచి ఈ బంధంపై అసూయ చెందుతూనే ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక అలజడి క్రియేట్ అయ్యే అవకాశం ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. మారుతున్న ప్రపంచ రాజకీయ సమీకరణాల్లో భారత్ రష్యా బంధం భవిష్యత్తులో ఎలా ఉండబోతోందో ఈ రెండు రోజుల పర్యటన డిసైడ్ చేయనుంది.