సూపర్ స్టార్ రజినీకాంత్ను తెలుగు వాళ్లు తలుచుకోగానే ఆయన సొంత గొంతు కంటే.. గాయకుడు మనో చెప్పే డబ్బింగ్ వాయిసే గుర్తుకు వస్తుంది. రజినీ వాయిస్లో ఉండే స్టైల్, మాడ్యులేషన్ను సరిగ్గా పట్టుకుని.. ఆయన బాడీ లాంగ్వేజ్కు తగ్గట్లుగా భలేగా డబ్బింగ్ చెబుతారు మనో. ఒకసారి రజినీ ఒరిజినల్ వాయిస్ వింటే.. దాని కంటే తెలుగులో మనో చెప్పే డబ్బింగే బాగుంటుంది అంటే అతిశయోక్తి ఏమీ కాదు.
బహుశా ఒక హీరోకు ఇంత సుదీర్ఘ కాలం వాయిస్ ఇస్తున్న డబ్బింగ్ ఆర్టిస్టు మరొకరు లేకపోవచ్చు. 90వ దశకంలో ‘ముత్తు’తో మొదలుపెట్టి.. మూడు దశాబ్దాలుగా సూపర్ స్టార్కు మనోనే డబ్బింగ్ చెబుతున్నారు. మరి రజినీతో ఆయన ప్రయాణం ఎలా మొదలైంది.. దీని వెనుక స్టోరీ ఏంటన్నది ఒక ఇంటర్వ్యూలో మనో వివరించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
‘‘ముత్తు సినిమాలో ముందుగా ముసలి రజినీకాంత్కు డబ్బింగ్ చెప్పమని నన్ను పిలిచారు. కేవలం రెండు సీన్లకు మాత్రమే డబ్బింగ్ చెప్పా. తర్వాత రజినీ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఎప్పట్నుంచి రజినీకి పూర్తి స్థాయిలో డబ్బింగ్ చెబుతారు అని అడిగారు. సార్కు నచ్చిందా అని అడిగాను. నా డబ్బింగ్ విని ఆయన చాలా సంతోషించారని.. నా వాయిస్లోని షార్ప్నెస్ ఆయనకు చాలా నచ్చిందని చెప్పారు. దీంతో రెండు పాత్రలకూ కలిపి 10 రోజుల పాటు డబ్బింగ్ చెప్పా. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అక్కడి నుంచి రజినీకి నేనే డబ్బింగ్ ఆర్టిస్టుగా ఫిక్సయిపోయాను. శివాజీ సినిమాలో నా డబ్బింగ్ విన్నాక రజినీ ఫోన్ చేసి మరీ అభినందించారు’’ అని మనో తెలిపారు.
తాను పాడిన పాటల్లో ‘ప్రేమికుడు’ మూవీ కోసం రెహమాన్తో చేసిన ‘ముకాబులా’ చాలా స్పెషల్ అని.. దాని వెనుక చాలా కసరత్తు జరిగిందని.. అనేక ప్రయత్నాలు చేసినా రెహమాన్కు నచ్చలేదని.. చివరికి హిందీ పాట ‘మెహబూబా.. మెహబూబా’ స్ఫూర్తితో ఆర్డీ బర్మన్ మాడ్యులేషన్లో ఈ పాట పాడితే రెహమాన్కు నచ్చిందని.. ఆ పాట సూపర్ డూపర్ హిట్టయి తనకు చాలా మంచి పేరు తెచ్చిందని మనో తెలిపాడు.