రేపు విడుదల కాబోతున్న సినిమాల్లో ముందు అటెన్షన్ లేక, ఒక్క లీకుతో సోషల్ మీడియా దృష్టిని తనవైపుకు తిప్పుకున్న రాజు వెడ్స్ రాంబాయి మీద టీమ్ మాములు నమ్మకంగా లేదు. లిటిల్ హార్ట్స్ తో తొలి థియేటర్ రిలీజ్ ని బ్లాక్ బస్టర్ చేసుకున్న ఈటీవీ విన్ ఇప్పుడు దీని మీద కూడా అంతే కాన్ఫిడెన్స్ తో ఉంది. బయట చక్కర్లు కొడుతున్న క్లైమాక్స్ ట్విస్ట్ నిజమో కాదో తెలియకుండానే జనాలు బాగా మాట్లాడేసుకుంటున్నారు. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ఇలాంటి షాకింగ్ ముగింపు తన జీవితంలో చూడలేదనే రేంజ్ లో ఎలివేషన్ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
సరే ఆ సంగతేంటో రేపు ఈ టైంకంతా తెలిసిపోతుంది కానీ టికెట్ రేట్ల విషయంలో రాజు వెడ్స్ రాంబాయి బృందం మంచి నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో సింగల్ స్క్రీన్ 99 రూపాయలు, మల్టీప్లెక్స్ 105 రూపాయలు పెడుతున్నామని, ప్రతిసారి ధరల గురించే చర్చ ఉంటుంది కాబట్టి ఈసారి అందుబాటు రేట్లు పెడుతున్నాం, కాబట్టి వచ్చి చూడమని నిర్మాతలు కోరుతున్నారు. అయితే ఆన్ లైన్ బుకింగ్స్ లో ఇంకా అప్డేట్ కావాల్సి ఉంది. పలు మల్టీప్లెక్సులు 150 రూపాయలు చూపిస్తుండగా ఏపీలోనూ ఇంకా సవరణ జారలేదు. ఏదైతేనేం ఇలాంటి చొరవ తీసుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం.
వందల కోట్ల బడ్జెట్ సినిమాలకు వందా నూటా యాభై పెంచినప్పుడు రెండు మూడు కోట్లలో తీసిన సినిమాలకు యాభై తగ్గించడంలో లాజిక్ ఉంది. దీని వల్ల ఫుట్ ఫుల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. పాజిటివ్ టాక్ వచ్చిందంటే కనీసం రెండు మూడు వారాలు మంచి రన్ దక్కుతుంది. అసలే వచ్చే వారం రామ్ ఆంధ్రకింగ్ తాలూకా, ఆపై డిసెంబర్ అయిదు అఖండ 2 వస్తున్నాయి. సో వీలైనంత ఫస్ట్ వీక్ లోనే రాబట్టుకోవడం రాజు వెడ్స్ రాంబాయి లాంటి వాటికి కీలకం. సినిమా బాగుందంటే ఎంత పోటీ ఉన్నా జనాలు లెక్క చేయరు కానీ అందరూ చెప్పుకుంటున్న క్లైమాక్స్ కనక సరిగ్గా కనెక్ట్ అయితే హిట్టు దక్కినట్టే.