పెనుకొండ : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సంచలన ప్రకటన చేశారు. పెనుకొండకు ప్రతిష్టాత్మకమైన ఇస్కాన్ టెంపుల్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక బేస్ క్యాంప్ రానుందంటూ వెల్లడించారు.. రూ.425.20 కోట్లతో ఈ ఆధ్యాత్మిక బేస్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ బేస్ క్యాంపు ఏర్పాటుతో 4,035 మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి లభించనుందని ఆమె వెల్లడించారు. ఈ మేరకు ఇవాళ మంత్రి సవిత మీడియాతో మాట్లాడారు. పెనుకొండలోని ప్రఖ్యాతగాంచిన గణగిరి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం ఉన్న కొండపై ఇస్కాన్ టెంపుల్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక బేస్ క్యాంపును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రూ. 425.20 కోట్లతో ఈ ఆధ్యాత్మిక బేస్ క్యాంపు ఏర్పాటుకు రెండ్రోజుల కిందట జరిగిన రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహం బోర్డు (ఎస్ఐపీబీ) పచ్చజెండా ఊపిందన్నారు.
60 ఎకరాల్లో ఆథ్యాత్మిక కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో ఆధ్యాత్మిక బేస్ క్యాంపు ఏర్పాటుకు ఆమోదం లభించిందని మంత్రి సవిత తెలిపారు. ఇస్కాన్ టెంపుల్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక బేస్ క్యాంపు ఏర్పాటుతో పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా పెనుకొండ అభివృద్ది చెందుతుందన్నారు. దేశ, విదేశాలకు చెందిన భక్తులు పెనుకొండకు రానున్నారన్నారు. ఈ బేస్ క్యాంపు ఏర్పాటుతో 1,035 మందికి ప్రత్యక్షంగా, 3 వేల మందికి పరోక్ష ఉపాధి లభించనుందన్నారు. త్వరలోనే ఇస్కాన్ టెంపుల్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక బేస్ క్యాంప్ ఏర్పాటుకు సంబంధించిన పనులు ప్రారంభం కానున్నట్ల మంత్రి సవిత తెలిపారు.
The post రూ.425.20 కోట్లతో ఇస్కాన్ ఆధ్యాత్మిక కేంద్రం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
రూ.425.20 కోట్లతో ఇస్కాన్ ఆధ్యాత్మిక కేంద్రం
Categories: