రెడ్ బుక్ ను చూస్తే వైసీపీ నేతలు వణికిపోతున్నారని, రకరకాల సాకులు చెప్పి అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారని మంత్రి లోకేశ్ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం మాత్రమే శిక్షిస్తామని, అటువంటి వారి పేర్లే రెడ్ బుక్ లో ఉన్నాయని లోకేశ్ చెప్పారు.
ఈ నేపథ్యంలోనే రెడ్ బుక్ పై మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ చూసి తాను కాదు కదా..తన ఇంట్లో కుక్కలు కూడా భయపడబోవని అన్నారు.
ఇక, రెడ్ బుక్ లో తన పేరుందో లేదో చెప్పాల్సింది లోకేశ్ అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు అంబటి జవాబిచ్చారు. రెడ్ బుక్ లో తన పేరుతో పాటు ఇంకా చాలా పేర్లున్నాయని ఆ బుక్ రాసిన పెద్దమనిషి చెబుతున్నాడని లోకేశ్ ను ఉద్దేశించి సెటైర్లు వేశారు.
రెడ్ బుక్ ను తన కుక్క కూడా లెక్కచేయదని ఆల్రెడీ చెప్పానని అన్నారు. రాజశేఖర రెడ్డి వెంట నడిచినవాళ్లమని, జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన వెంట ఉన్నవాళ్లమని, ఈ రెడ్ బుక్ లు, పిచ్చి బుక్ లకు తాము భయపడబోమని చెప్పారు.
లోకేశ్ కు ఏం తెలుసని, అర్ధాంతరంగా రాజకీయాల్లోకి వచ్చాడని అంబటి విమర్శించారు. సీఎం కొడుకు కాబట్టి పెత్తనం చేస్తున్నాడని, లోకేశ్ కు రాజకీయ అనుభవం లేదని ఎద్దేవా చేశారు. రాబోయే కాలంలో టీడీపీ పతనానికి లోకేశే నాంది కాబోతున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి, అంబటి వ్యాఖ్యలకు లోకేశ్ కౌంటర్ ఏవిధంగా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది.