2026 టి20 వరల్డ్ కప్ వేదికల విషయంలో బంగ్లాదేశ్ ఆడుతున్న నాటకాలు ఇప్పుడు కొత్త మలుపు తిరిగాయి. భారత్లో ఆడేందుకు భద్రతా కారణాలు సాకుగా చూపుతున్న బంగ్లాదేశ్, ఇప్పుడు దౌత్యపరమైన మద్దతు కోసం ఏకంగా పాకిస్థాన్తో చేతులు కలిపింది.
ఒకవేళ బంగ్లాదేశ్ రాకపోతే తాము కూడా రాము అంటూ పాక్ కూడా ఇన్ డైరెక్ట్ గా కూతలు కూస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి ఐసీసీపై ఒత్తిడి తెచ్చి ఇండియాను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని తెలుస్తోంది.
అయితే ఇక్కడ అసలు కామెడీ ఏంటంటే.. 1971లో ఇదే పాకిస్థాన్ దారుణమైన అణచివేతకు గురిచేస్తుంటే, భారత్ అండగా నిలబడి బంగ్లాదేశ్కు స్వాతంత్య్రం తెచ్చిపెట్టింది. ఆ రోజు భారత్ చేసిన సాయం లేకపోతే బంగ్లాదేశ్ అనే దేశమే ఉండేది కాదు.
అలాంటిది ఇప్పుడు అదే పాకిస్థాన్తో కలిసి, తనకు జన్మనిచ్చిన తల్లి లాంటి దేశం మీద ఇలాంటి రాజకీయాలు చేయడం చూస్తుంటే బంగ్లాదేశ్ తన పాత చరిత్రను ఎంత త్వరగా మరిచిపోయిందో అర్థమవుతోంది.
ప్రస్తుతం బంగ్లాదేశ్లో రాజకీయ స్వలాభం కోసం అక్కడి ప్రభుత్వం భారత్పై వ్యతిరేకతను పెంచుకుంటోంది. షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడం, ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్ తప్పుకోవడం వంటి విషయాలను పెద్దవి చేస్తూ ఈ వివాదాన్ని రాజేస్తోంది. కేవలం రాజకీయ కోపంతో క్రికెట్ మైదానాన్ని వాడుకోవడం ఏంటని క్రీడా ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. ఐసీసీ సెక్యూరిటీ టీమ్ భారత్లో సేఫ్ అని చెప్పినా వీరు వినకపోవడం విడ్డూరంగా ఉంది.
పాకిస్థాన్ కూడా ఇదే అదునుగా భావించి మెల్లగా బంగ్లాదేశ్కు మద్దతు ఇస్తోంది. ఒకవేళ వీరు ఇద్దరూ టోర్నీ నుంచి తప్పుకున్నా ఇండియాకు లేదా ఐసీసీకి వచ్చే నష్టం అణాపైసా కూడా లేదు. నిజం చెప్పాలి అంటే పాక్ క్రికెట్ బోర్డు, బంగ్లా క్రికెట బోర్డులకే తీవ్ర నష్టం. ప్రపంచ క్రికెట్లో టీమ్ ఇండియాకున్న క్రేజ్, మార్కెట్ వాల్యూ ముందు ఈ ఇద్దరి బెదిరింపులు ఏమాత్రం పనిచేయవు. ఇద్దరూ కలిసి ఈ వరల్డ్ కప్ ను బహిష్కరించినా టోర్నీ సక్సెస్ లో ఎలాంటి మార్పు ఉండదు.