రాజమౌళి కుటుంబంలో అందరూ ప్రతిభావంతులే. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్కు రచయితగా ఎంత గొప్ప పేరుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇక సోదరుడు కీరవాణి సంగీత ప్రతిభ గురించి పరిచయం అనవసరం. రాజమౌళి సతీమణి రమ స్టైలిస్టుగా గొప్ప పేరే సంపాదించింది. రాజమౌళి మరో సోదరుడు కళ్యాణి మాలిక్ కూడా సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. వీళ్లందరూ జనాలకు బాగానే తెలుసు.
కానీ రాజమౌళి మరో సోదరుడు ఎస్.ఎస్.కాంచిలో ఉన్న ప్రతిభకు తగినంత గుర్తింపు రాలేదనే చెప్పాలి. ‘అమృతం’ సీరియల్లో కీలక పాత్ర ద్వారా ఫేమ్ తెచ్చుకున్న కాంచి.. తర్వాత మరి కొన్ని చిత్రాల్లో నటించాడు. ఇటీవల లిటిల్ హార్ట్స్ మూవీతో ఆయనకు మంచి బ్రేక్ వచ్చింది. ఐతే కాంచి కేవలం నటుడే కాదు. రచయిత, దర్శకుడు కూడా. ‘మర్యాద రామన్న’కు కథ అందించడంతో పాటు రాజమౌళి సినిమాలు మరి కొన్నింటికి రచనా సహకారం అందించాడు. ఆయన షో టైం అనే సినిమాను కూడా డైరెక్ట్ చేశాడు. ‘బాణం’ ఫేమ్ రణధీర్.. రుస్కర్ థిల్లాన్ జంటగా నటించిన ఆ చిత్రం ఏవో కారణాలతో ప్రేక్షకుల ముందుకు రాలేదు. తర్వాత ఆయన దర్శకత్వ ప్రయత్నాలు చేయలేదు.
ఐతే కాంచి ఇప్పుడు ఒక సెన్సేషనల్ మూవీకి రచన చేయడం విశేషం. ఆ చిత్రమే.. వారణాసి. మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న ఈ చిత్రానికి కాంచి రచయితగా పని చేశాడు. రాజమౌళి చిత్రాలకు సాధారణంగా కథకుడిగా విజయేంద్ర ప్రసాద్ పేరే పడుతుంది. వేరే రచయితల సహకారం తీసుకున్నా.. మేజర్ కంట్రిబ్యూషన్ విజయేంద్రదే ఉంటుంది. కాబట్టి ఆయనే కథకుడిగా ఉంటాడు.
కానీ ఈసారి మాత్రం ఆయనతో పాటు కాంచి కూడా తోడయ్యాడు. టైటిల్ క్రెడిల్స్లో కూడా ఆయన పేరు పడనుంది. నిన్నటి వీడియో గ్లింప్స్లో కూడా విజయేంద్ర పేరు పక్కనే కాంచి నేమ్ కూడా వేశారు. ఈసారి ఇద్దరికీ కలిపి స్టోరీ క్రెడిట్ ఇవ్వబోతున్నారు. కాంచికి పురాణాల మీద గొప్ప పట్టే ఉంది. ఆ పట్టుతోనే విజయేంద్రతో కలిసి వారణాసి కథను వండారు. ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ అందుకు తగ్గ పేరు సంపాదించలేకపోయిన కాంచికి వారణాసి పెద్ద బ్రేకే ఇచ్చేలా ఉంది.