ఇప్పుడు నడుస్తోంది ఓటిటి యుగం. ఒక సినిమా థియేటర్ రన్ పూర్తి చేసుకున్నాక ఒకప్పుడైతే శాటిలైట్ ఛానల్ లో ప్రీమియర్ వేయడం కోసం ప్రేక్షకులు ఎదురు చూసేవారు. కానీ కరోనా టైంలో ఓటిటిలు విశ్వరూపం చూపించాక మెజారిటీ ఆడియన్స్ అటువైపు షిఫ్ట్ అయిపోయారు. అందుకే నాలుగు వారాలు దాటడం ఆలస్యం ఏదైనా కొత్త రిలీజ్ డిజిటల్ లో వచ్చిందంటే చాలు మిలియన్ల వ్యూస్ వెల్లువలా వచ్చి పడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఓజి నెట్ ఫ్లిక్స్ లో సృష్టిస్తున్న రికార్డులే దానికి సాక్ష్యం. ఇటీవలే కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.
ఇది జరిగి నాలుగు రోజులు అవుతున్నా కాంతార చాప్టర్ వన్ ఇప్పటికీ బుక్ మై షో ట్రెండింగ్ లో ఉండటం షాక్ కలిగించే వాస్తవం. గంటకు సగటున పదిహేను వందలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. విడుదలైన నెల రోజుల తర్వాత కూడా రోజుకు పాతిక వేల దాకా ఆన్ లైన్ టికెట్లు అమ్మడమంటే మాములు విషయం కాదు. హిందీలో నిన్న వీకెండ్ రెండు కోట్లకు పైగా నెట్ వసూలయ్యిందని బాలీవుడ్ ట్రేడ్ టాక్. అంటే థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోరుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు తప్పించి ఇంట్లోనే తాపీగా చూడాలని అనుకోవడం లేదు. ఇది కాంతార సాధించిన ఘనత.
ఎనిమిది వందల కోట్లు గత వారమే దాటినప్పటికీ వెయ్యి కోట్ల మార్కుని అందుకోవడం పట్ల అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. ఒకవేళ ఓటిటి కనక ఆలస్యం చేసి ఉంటే మళ్ళీ పికప్ అయ్యేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కన్నడలో కాంతార ఇప్పటికీ స్ట్రాంగ్ గానే ఉంది. నిన్న వారాంతం బెంగళూరు, బెళగావి, హుబ్లీ లాంటి నగరాల్లో చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. యాభై రోజుల దాకా రన్ ఉంటుందని అక్కడి ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. కంటెంట్ సాలిడ్ గా ఉంటే ఓటిటిలో వచ్చినా సరే జానాన్ని థియేటర్లకు రప్పించేలా చేయొచ్చని నిరూపించిన కాంతారని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.