నిన్న జరిగిన అల్లు శిరీష్ నిశ్చితార్థ వేడుక తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. గత కొంత కాలంగా మెగా అల్లు కుటుంబాల మధ్య సఖ్యత లేదనే ప్రచారం జోరుగా జరుగుతున్న నేపథ్యంలో ఈ రెండు కుటుంబాల నుంచి అందరూ హాజరు కావడం పుకార్లకు చెక్ పెట్టే అవకాశాన్ని వాడుకుంది. ఇటీవలే ఉపాసన శ్రీమంతం ఫంక్షన్ ఫోటోల్లో అల్లు తరఫున ఎవరూ కనిపించకపోవడంతో కొత్త అనుమానాలు తలెత్తిన సంగతి తెలిసిందే. అయితే అరవింద్ తో సహా అందరూ వచ్చారని, కాకపోతే బయటికి వదిలిన పిక్స్ లో కనిపించకపోవడం వల్లే కొత్త ప్రచారానికి తెరతీశారనే టాక్ అంతర్గతంగా ఉంది.
ఏదైతేనేం తమ మధ్య బయట అనుకున్న స్థాయిలో పొరపొచ్చాలు లేవని మెగా, అల్లు నుంచి ఇలాంటి సందర్భాల్లో క్లారిటీ వస్తూనే ఉంది. నంద్యాల ప్రచారానికి అల్లు అర్జున్ వెళ్లినప్పటి నుంచి మెగా ఫ్యాన్స్, అల్లు అభిమానుల మధ్య ఆన్ లైన్ వార్ జరుగుతూనే ఉంది. దానికి తగ్గట్టే మధ్యలో జరిగిన కొన్ని పరిణామాలు విబేధాల వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. శిరీష్ వేడుకలో చిరంజీవి క్యాజువల్ లుక్ తో అందరిని తన వైపు తిప్పేసుకున్నారు. నాగేంద్రబాబు, వరుణ్ తేజ్ సతీసమేతంగా విచ్చేయగా, పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకపోవడంతో భార్య అన్నా రావడం ఆ లోటుని తీర్చింది.
ఇప్పుడే కాదు అల్లు అరవింద్ తల్లిగారు చనిపోయినప్పుడు కూడా మెగా అల్లు కుటుంబాలు కలుసుకున్నాయి. ఇప్పుడు మరోసారి సంతోషం పంచుకునే సందర్భం రావడంతో తామంతా ఒకటేననే సందేశం ఇచ్చినట్టు అయ్యింది. రామ్ చరణ్ పెద్ది లుక్ లో విచ్చేయగా, సాయి దుర్గ తేజ్ బ్రదర్స్ ఆసాంతం అటుఇటు తిరుగుతూ కనిపించారు. అల్లు అర్జున్ గెస్టులను రిసీవ్ చేసుకోవడంతో పాటు సాగనంపడం లాంటి దృశ్యాలు ఫ్యాన్స్ క్యాచ్ చేశారు. ఇంకా చాలా ఫుటేజ్ బయటికి రావాల్సి ఉంది. అవన్నీ వస్తే అభిమానులకు మంచి కనులవిందైన కంటెంట్ దొరికినట్టే. ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు.