అమరావతి : భక్తుల కోరిక మేరకు త్వరలో శ్రీకాళహస్తి క్షేత్రాన్ని సందర్శిస్తానని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆహ్వానం మేరకు కచ్చితంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటానని అన్నారు. శివరాత్రికి రెండు రోజుల ముందు శ్రీకాళహస్తి గిరి ప్రదక్షణ మార్గాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. గత ప్రభుత్వం ఆలయాల పరిరక్షణ అంశాన్ని చాలా నిర్లక్ష్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దేవాదాయ మంత్రిగా రామనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ఆలయాల పరిరక్షణను ఎంతో బాధ్యతగా ముందుకు తీసుకువెళ్తున్నారని ప్రశంసలు కురిపించారు పవన్ కళ్యాణ్. నిరాదరణకు గురైన ఎన్నో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు.
భక్తులు కోరుకుంటే ఏజెన్సీలో కూడా ఆలయాలు నిర్మించాలన్న ఆయన గొప్ప సంకల్పానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. శివరాత్రి తర్వాత గిరిప్రదక్షణ మార్గంలో మొక్కలు నాటుతామని చెప్పారు. రూ. 10 కోట్లు వెచ్చించి సిమెంటు రోడ్డు నిర్మించామన్నారు. 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షణ మార్గాన్ని మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో గిరిప్రదక్షణ మార్గానికి ఇరు వైపులా మొక్కలు నాటే కార్యక్రమానికి శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం శ్రీకారం చుట్టబోతున్నాం అని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి అడుగులో మన సనాతన ధర్మ ఔన్నత్యాన్ని పరిరక్షించేందుకు కృషి చేస్తూ వస్తున్నామన్నారు పవన్ కళ్యాణ్ కొణిదల. దేవాదాయ శాఖ సహకారంతో ఏలూరు జిల్లా ఐ.ఎస్. జగన్నాథపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉన్న కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డు రూ. 3 కోట్ల 70 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టామన్నారు. ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ పరిసరాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాం. ఇటీవల కోటప్పకొండ నుంచి కొత్తపాలెం గ్రామం వైపు వెళ్లే రోడ్డును సుమారు రూ. 4 కోట్లతో తో నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చాం అన్నారు.
The post శ్రీకాళహస్తి ఆలయాన్ని అభివృద్ది చేస్తాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
శ్రీకాళహస్తి ఆలయాన్ని అభివృద్ది చేస్తాం
Categories: