తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల హుండీ పరకామణిలో జరిగిన దొంగతనాన్ని బయటకు తీసి ఫిర్యాదు చేసిన టీటీడీ ఉద్యోగి మరియు ఏవీ ఎస్ వో సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆయనే ఈ కేసును వెలుగులోకి తెచ్చిన వ్యక్తి.
2021 22లో పరకామణిని లెక్కించే సమయంలో విదేశీ డాలర్లను దొంగిలిస్తున్న సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ను సతీష్ గుర్తించారు. వెంటనే ఆయన అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఈ కేసు బయటపడిన తర్వాత లోక్ అదాలత్లో రాజీ కుదిరింది. ఈ క్రమంలో రవికుమార్ తన వద్ద ఉన్న వంద కోట్ల రూపాయల ఆస్తులను శ్రీవారికి ఇచ్చేశారు. అయితే ఇలాంటి రాజీ ఎందుకు కుదిరిందనే అంశంపై తిరుపతికి చెందిన జర్నలిస్టు శ్రీనివాస్ హైకోర్టులో పిల్ వేశారు. దీంతో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ కేసు మళ్లీ తెరమీదికి వచ్చింది. అప్పటి హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగిస్తోంది.
అప్పటి ఈవోతో పాటు అప్పటి చైర్మన్ గా వ్యవహరించిన భూమన కరుణాకరరెడ్డిని కూడా విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంతో కీలక పాత్ర పోషించిన సతీష్ కుమార్ మృతదేహం అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్ వద్ద కనిపించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పరకామణి కేసు కీలక దశలో ఉండగా సతీష్ అనుమానాస్పదంగా మరణించడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. దీని వెనుక పరకామణి దొంగలే ఉండి ఉంటారన్న ఆరోపణలు బీజేపీ మరియు టీడీపీ నాయకుల నుంచి వినిపిస్తున్నాయి. కర్నూలుకు చెందిన సతీష్ టీటీడీ భద్రతా విభాగంలో పనిచేస్తున్నారు. ఆయన మృతి కేసుపై మరింత అనుమానాలు పెంచుతోంది. వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రమేయం ఉందన్న ఆరోపణలను టీడీపీ నాయకులు బలంగా చెబుతున్నారు.