ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు. వాస్తవానికి మెజారిటీ సభ్యులు ఉన్నప్పటికీ.. మండలిలోనూ పారదర్శక విధానంలో కార్యక్రమాలు జరిగేలా వైసీపీ సభ్యులు సహకరించకపోవడం గమనార్హం. గురువారం చిన్నపిల్లలు ఊదుకునే విజిల్స్ తీసుకువచ్చి.. చైర్మన్ పోడియంను ముట్టడించి.. విజిల్స్ వేసిన వైసీపీ సభ్యులు శుక్రవారం దేవుడి ఫొటోలతో హల్చల్ చేశారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల నేపథ్యంలో మండలిలో చర్చలు కాస్తా దారి తప్పాయి. సీఎం చంద్రబాబు కుటుంబ సారధ్యంలోని హెరిటేజ్ సంస్థకు.. ఇందాపూర్ డెయిరీకి లింకు పెట్టి దీనిపై చర్చించాలంటూ.. వరుసగా మూడో రోజు కూడా.. సభలో వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. దీనిని చైర్మన్ వరుసగా శుక్రవారం కూడా తోసిపుచ్చారు. దీంతో దేవుడి ఫొటోలు పట్టుకుని వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు.
తీవ్రంగా ఖండించిన అధికార సభ్యులు..
వైసీపీ సభ్యులు మండలిలో ప్రవర్తించిన తీరును అధికార కూటమి పార్టీల సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఇది మండలి సంప్రదాయాలకు విరుద్ధమని.. మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ తదితరులు తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ సభ్యుల ప్రవర్తనను అనుమతించవద్దని చైర్మన్కు సూచించారు. దీంతో చైర్మన్ సైతం వైసీపీ సభ్యుల ప్రవర్తనను తాను అనుమతించడం లేదని.. వారిని పిలిచి చర్చిస్తానని చెప్పారు. అయితే.. క్షమాపణలు చెప్పించాలని అధికార పార్టీల సభ్యులు డిమాండ్ చేయడంతో సభలో గందరగోళం నెలకొంది.
ఇదే తొలిసారి..
చట్టసభల్లో కాయితాలు చింపడం.. చర్చల ప్రతులను చింపిపోయడం, నినాదాలు చేయడం కామనే. అయితే.. తొలిసారి విజిల్స్ తీసుకుని వచ్చి ఈలలు వేస్తూ గోల చేయడం ఇదే తొలిసారి అని మాజీ సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు.
తాజాగా శ్రీవారి చిత్రపటాలను సభలోకి తీసుకువచ్చి.. రాజకీయంగా వాడుకునే ప్రయత్నం సరికాదని.. ఇది హిందువుల మనో భావాలను దెబ్బతీయడమే అవుతుందని చెబుతున్నారు. ఇదే విషయాన్ని కూటమి సభ్యులు కూడా చెబుతున్నారు. ఈనేపథ్యంలో వైసీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉందని అంటున్నారు.