ఒంటిమిట్ట / తిరుపతి : ఒంటిమిట్టలో ఇవాళ శ్రీ సీతారామ కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. టిటిడి ఈవో శ్రీ ఎం. రవిచంద్ర ఆదేశాల మేరకు టీటీడీ ఉన్నత అధికారులు, జిల్లా అధికారులతో సమిష్టిగా సమన్వయం చేసుకుని భక్తులకు ప్రణాళిక బద్ధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏకశిలానగరంలో జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణాన్ని టిటిడి, జిల్లా యంత్రాంగం సమన్వయంతో వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీ సీతారాముల కల్యాణం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న 121 గ్యాలరీలలో 60 వేల మంది సౌకర్యవంతంగా కూర్చుని వీక్షించేలా చేశారు. ప్రతి గ్యాలరీలో భక్తులకు సకాలంలో సేవలు అందెలా పారా మెడికల్ సిబ్బంది, టిటిడి ఉద్యోగులు, పోలీసు, శ్రీవారి సేవకులు ఉండేలా చర్యలు చేపట్టారు. కల్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాలు పంపిణీ కోసం 28 కియోస్క్ లు (కౌంటర్లు) ఏర్పాటు చేశారు. కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదం, కంకణం, అన్నప్రసాదాలు అందజేశారు.
•నడిచి వచ్చే భక్తుల సౌకర్యార్థం 11 ప్రాంతాలలో ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేశారు. ఇందులో పానకం, మజ్జిగ, చలివేంద్రం, వాటర్ కూలర్లు, పోలీస్, మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచారు. శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం నుండి కల్యాణ వేదిక వరకు భక్తులు చల్లని వాతావరణంలో నడిచేందుకు వీలుగా చలువ పందిళ్లు, నీటి పిచుకారి యంత్రాలు ఏర్పాటు చేశారు. ఆలయ సమీపంలో 3 వేల మంది భక్తులు వేచి ఉండేందుకు, క్యూ లైన్లలో వెళ్ళెందుకు జర్మన్ షెడ్డు ఏర్పాటు చేశారు.శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో ఉండే భక్తులతో పాటు, కల్యాణం వీక్షించేందుకు వచ్చిన భక్తులందరూ శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేలా 21 ఎల్ఈడీ స్క్రీన్ లు ఉంచారు. ఆలయం, కల్యాణ వేదిక, పరిసర ప్రాంతాల్లో 38 వివిధ దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు, భక్తులు సులువుగా గుర్తించేదెలా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.
టిటిడి విజిలెన్స్ విభాగం, అబ్జర్వేషన్ టీం, ఫైర్ సిబ్బంది 510 మంది, టిటిడి స్కౌట్స్ 200 మంది, జిల్లా పోలీస్ యంత్రాంగం 3,000 మంది సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా 235 సిసి కెమెరాలు, 12 డ్రోన్ లు, కామాన్ కమెండ్ కంట్రోల్ సెంటర్, మరో మూడు 3 సబ్ కంట్రోల్ రూమ్ ల నుండి పర్యవేక్షించారు. కళ్యాణానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం కడప వైపు 13, తిరుపతి వైపు 5 చోట్ల పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు. దాదాపు 21 కి.మీ మేర లైటింగ్, సూచిక బోర్డులు, మొబైల్ పెట్రోలింగ్, పర్యవేక్షణ టీంలు పని చేశాయి. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఉదయం నుండి రాత్రి వరకు ఆలయ ప్రాంగణంలో, కల్యాణ వేదిక వద్ద నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఇందులో రుచికరమైన అన్నం, సాంబరు, రసం, మజ్జిగ, పచ్చడి, కర్రీ, బెల్లం పొంగలి అందించారు.
కల్యాణాన్ని వీక్షించేందుకు గ్యాలరీలలో వేచి ఉండే భక్తులకు సాయంత్రం నుండి పులిహోర, రవ్వ కేసరి, మైసూర్ పాక్, బిస్కెట్ ప్యాకెట్, కారాసు, అరటిపండు, టిష్యూ పేపర్, ఉడెన్ స్పూన్, 3 లక్షల తాగునీరు బాటిల్స్, వాటర్ టబ్బుల ద్వారా నీటి సరఫరా, 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, లక్ష టెట్రా ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఆర్టిసి ద్వారా కడప నుండి ఒంటిమిట్ట వరకు 85 బస్సులతో 425 ట్రిప్పులు, రాజంపేట నుండి ఒంటిమిట్ట వరకు 40 బస్సులతో మొత్తం 625 ట్రిప్పుల ద్వారా భక్తులకు రవాణా సౌకర్యం కల్పించారు. ట్రాఫిక్ డైవర్షన్ ప్రాంతాల నుండి కల్యాణ వేదిక వరకు 20 బస్సులు ఏర్పాటు చేశారు.
కల్యాణ వేదిక, ఆలయం, పరిసర ప్రాంతాల్లో 12 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, లక్ష కట్ ఫ్లవర్స్ తో పుష్పాలంకరణలు చేపట్టారు. మొదటిసారి ఆలయ ప్రాంగణంలో కళాకృతులుతో సంక్షిప్త రామాయణాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ సీతా రాముల కల్యాణంలో గోవిందనామ సరళిలో శ్రీ రామనామ భజనామృతం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 13 వైద్య శిబిరాలు, 250 మంది పారామెడికల్ సిబ్బంది, 35 మంది వైద్య నిపుణులు, 8 అంబులెన్స్ లు, అగ్నిమాపక సిబ్బంది విధులు నిర్వహించారు. కళ్యాణ వేదిక, ఆలయ పరిసరాలలో 250 మరుగుదొడ్లు, టిటిడి, జిల్లా యంత్రాంగం సమన్వయంతో 3,268 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహించేలా చేశారు. 500 మంది టీటీడీ డిప్యూటేషన్ ఉద్యోగులు, 2500 మంది శ్రీవారి సేవకులు, భక్తులకు సౌకర్యవంతంగా సేవలు అందించారు. శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు వీక్షించేందుకు వీలుగా హెచ్డి క్యాలిటీతో ప్రత్యక్ష ప్రసారం అందించింది.
The post సీతారాములోరి కళ్యాణానికి పోటెత్తిన భక్తులు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
సీతారాములోరి కళ్యాణానికి పోటెత్తిన భక్తులు
Categories: