భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి రెండు రోజుల కిందట అర్ధంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్ల పాటు ప్రేమలో ఉన్న సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ను ఈ ఆదివారం పెళ్లి చేసుకోవాల్సింది స్మృతి. మూడు రోజుల ముందు నుంచి ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గట్టిగా జరిగాయి. ఐతే సాయంత్రం పెళ్లి అనగా ఉదయం అనుకోకుండా వేడుకలు ఆగిపోయాయి.
స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన గుండెపోటుకు గురవడం వల్లే పెళ్లి ఆగినట్లు వార్తలు వచ్చాయి. ఆయన కోలుకునే వరకు వివాహాన్ని వాయిదా వేస్తున్నట్లు కుటుంబ వర్గాలు తెలిపినట్లు మీడియాలో పేర్కొన్నారు. కానీ తర్వాతి రోజు నుంచి అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనేక రూమర్లు వినిపిస్తున్నాయి. స్మృతి, పలాష్ల పెళ్లి జరగకపోవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఓవైపు తండ్రికి ఆసుపత్రిలో సీరియస్గా ఉంటే.. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలన్నీ స్మృతి డెలీట్ చేసింది. ఆమె స్నేహితులైన ఇతర భారత క్రికెటర్లు సైతం సోషల్ మీడియా నుంచి వీడియోలు, ఫొటోలు తీసేశారు. మరోవైపు పలాష్ కూడా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఒక రోజు విరామం తర్వాత పలాష్ రెండోసారి ఆసుపత్రిలో చేరినట్లు మంగళవారం వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే పెళ్లి ఆగిపోవడానికి అసలు కారణం వేరే అంటూ రూమర్లు ఊపందుకుంటున్నాయి.
పలాష్.. స్మృతిని మోసం చేశాడని, మరో అమ్మాయితో అతడికి సంబంధం ఉందని తెలియడంతో అర్ధంతరంగా వివాహం ఆపేశారని ఒక స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ నిజానిజాలు తెలుసుకోకుండా కొందరు కావాలనే ఈ ప్రచారం చేస్తున్నట్లు మరో వర్గం ఖండిస్తోంది. ఈ స్టోరీకి కొత్తగా ఇంకో కథ యాడ్ అయింది మంగళవారం. స్మృతితో రిలేషన్షిప్లో ఉండగానే పలాష్ ఒక అమ్మాయిని ఫ్లర్ట్ చేసిన చాటింగ్ అంటూ కొన్ని స్క్రీన్ షాట్లు వైరల్ అవుతున్నాయి. ఇలా రోజు రోజుకూ ఇలాంటి ప్రచారాలు పెరిగిపోతున్నాయి. స్మృతి-పలాష్ మౌనాన్ని వీడి ఉమ్మడిగా ఒక ప్రకటన ఇవ్వడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.