భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలవడంపై దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో సంబరాలు జరిగాయో చూస్తూనే ఉన్నాం. గత ఏడాది పురుషుల జట్టు టీ20 ప్రపంచకప్ గెలిచినపుడు ఏ స్థాయిలో సెలబ్రేషన్ ఉందో.. ఇప్పుడు అదే స్థాయిలో సంబరాలు చేసుకున్నారు. ఇండియన్ టీం ఆడిన ప్రతి మ్యాచ్కూ స్టేడియాలు కిక్కిరిసిపోయాయి. ఫైనల్ టికెట్ల కోసం అయితే డిమాండ్ మామూలుగా లేదు. ఒక రోజు ముందే టికెట్లన్నీ సోల్డ్ ఔట్ అయిపోయాయి.
మహిళల క్రికెట్కు దేశంలో ఈ స్థాయి ఆదరణ వస్తుందని ఓ పదేళ్ల ముందు ఎవ్వరూ ఊహించి ఉండరు. కొన్నేళ్ల నుంచి మహిళల జట్టును గొప్పగా ప్రోత్సహిస్తున్న బీసీసీఐ.. కప్పు గెలిచిన టీంకి రూ.51 కోట్ల భారీ నజరానాను కూడా ప్రకటించింది. మరోవైపు ఐసీసీ నుంచి ట్రోఫీతో పాటుగా రూ.37 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. ఇవి కాక ప్రభుత్వ, ప్రైవేటు వర్గాల నుంచి రకరకాల నజరానాలు అందబోతున్నాయి భారత జట్టుకు. మొత్తంగా చూస్తే పురుష క్రికెటర్లతో సమానంగా అమ్మాయిలపై కోట్ల వర్షం కురుస్తోంది.
ఇలా ఇప్పుడు మహిళల జట్టు స్వర్ణయుగమే చూస్తోంది. కానీ 2005లో మహిళల వన్డే ప్రపంచకప్లో రన్నరప్గా నిలిచిన భారత జట్టులో ఒక్కొక్కరికి కేవలం వెయ్యి రూపాయల నజరానా దక్కిందట. ఈ విషయాన్ని అప్పటి కెప్టెన్ మిథాలీ రాజ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. అప్పటికి భారత మహిళల జట్టు బీసీసీఐ పరిధిలో లేదు. ఉమన్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా.. జట్టును నడిపించేది. వాళ్ల దగ్గర నిధులుండేవి కావు. ప్రపంచకప్ రన్నరప్ అయిన టైంలో అసోసియేషన్ దగ్గర కేవలం రూ.8 వేల నిధులున్నాయని.. ఎలాగోలా సర్దుబాటు చేసి ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున నజరానా అందించారని ఆమె తెలిపింది.
దీన్ని బట్టి అప్పట్లో మిథాలి బృందం ఎంత కష్టపడి క్రికెట్ ఆడిందో అర్థం చేసుకోవచ్చు. ఆ రోజుల్లో జట్టు మొత్తానికి కేవలం మూడు బ్యాట్లు ఉండేవట. ఎక్కువగా రైళ్లలోనే ప్రయాణాలు చేసేవాళ్లు. కొన్నిసార్లు జనరల్ బోగీల్లోనూ వెళ్లేవాళ్లు. ఒక విదేశీ పర్యటనకు డబ్బులు లేక చందాలు వేసుకుని వెళ్లిన రోజులనూ మిథాలి చూసింది. ఐతే 2006లో మహిళల జట్టు బీసీసీఐ పరిధిలోకి వచ్చాక అంతా మారింది. ఇప్పుడు పురుషులతో సమానంగా మ్యాచ్ ఫీజులు, నజరానాలు అందుతున్నాయి మహిళల జట్టుకు.