తిరుపతి : గత తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తూ వస్తున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం నాటితో ముగిశాయి. ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై లోకం క్షేమంగా ఉండడానికి , భక్తులు సుఖ శాంతులతో ఉండడానికి చక్రస్నానం నిర్వహించారు. ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకుంటారో వారు సమస్త పాప విముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
ఆలయంలోని పోటులో శ్రీ వంశీస్వామి, శ్రీ శేషుస్వామి ఆధ్వర్యంలో రోజుకు దాదాపు 20 వేల మంది భక్తులకు పది రకాల ప్రసాదాలు తయారుచేసి పంపిణీ చేశారు. గరుడసేవ, రథోత్సవం, చక్రస్నానం వంటి పర్వదినాలలో 25 వేల నుండి 30 వేల మందికి ప్రసాదాలు అందించారు. ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల విశేషాలను మీడియా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులకు అందజేశారు. రోజుకు 100 మంది చొప్పున శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు.బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో వెయ్యి మందికి, ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి ఆధ్వర్యంలో 1500 మందికి వైద్యసేవలందించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
బ్రహ్మోత్సవాల్లో సరాసరి రోజుకు 7 వేల పైచిలుకు భక్తులకు టిటిడి , దాతల సహకారంతో ప్రతిరోజూ అన్నప్రసాదాలు అందించారు. గరుడసేవ రోజున విరివిగా పంపిణీ చేశారు. ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో తొమ్మిది రోజులకు గాను 9 టన్నుల పుష్పాలు, 50వేలు కట్ ఫ్లవర్స్ వినియోగించారు. 60 మంది సిబ్బంది నిరంతరాయంగా సేవలందించారు. స్నపన తిరుమంజనం, వసంతోత్సవం లాంటి ప్రత్యేక సందర్భాల్లో బెంగళూరు, చెన్నై నుంచి వివిధ రకాల పుష్పాలతో రూపొందించిన మాలలు తెప్పించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీనివాస మంగాపురం ఆలయ వెలుపల, లోపులతో పాటు పరిసర ప్రాంతాల్లో, ప్రధాన కూడళ్లలో ఆకట్టుకునేలా రంగురంగుల ఎల్ ఈ డి విద్యుత్ దీపాలు, భక్తి భావాన్ని పెంచేలా లైటింగ్ డిజైన్లు, భక్తులకు ఆహ్వానం పలికేలా అలంకరణలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
టీటీడీ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో ప్రతి రోజూ 75 మంది పారిశుద్ధ్య కార్మికులతో ఆలయం, పోటు, ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచారు. గరుడసేవ, రథోత్సవం, చక్రస్నానం వంటి ప్రత్యేక దినాలలో 25 మంది అదనపు సిబ్బంది సేవలందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్, సూపరింటెండెంట్ రాజ్కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధన శేఖర్, ముని శంకర్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
The post ఘనంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ఘనంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
Categories: