మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్ నేటి నుంచి మూడు రోజులు పాటు సొంత జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం మూడు రోజుల షెడ్యూల్ విడుదల చేసింది. క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బారు నిర్వహించి ప్రజలతో మమేకం కానున్నారు. అదే సమయంలో క్యాడర్ పైన ఆయన ఫోకస్ పెడతారు అని భావిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకుని క్యాంప్ ఆఫీస్లో రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్భార్ నిర్వహిస్తారు, రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.
రేపు బ్రహ్మణపల్లి చేరుకుని అరటి తోటలను పరిశీలించి అక్కడే అరటి రైతులతో మాట్లాడతారు. పలు ప్రైవేట్ కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొంటారు. అనంతరం అక్కడినుంచి పులివెందుల చేరుకుని క్యాంప్ ఆఫీస్లో రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్భార్ నిర్వహిస్తారు, రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. ఎల్లుండి ఉదయం 8 గంటలకు పులివెందుల నుంచి తిరుగుపయనమవుతారు.
కొద్ది నెలల కిందట జరిగిన జడ్పిటిసి బై ఎలక్షన్స్ లో పులివెందుల నియోజకవర్గం లో వైసీపీ కనీసం తమ పార్టీ ఏజెంట్లను కూడా ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి ఎదురైంది. జగన్ కు కంచుకోట అని భావించే పులివెందులలో ఘోర పరాజయాన్ని ఎదురుచూసింది. దశాబ్దాలుగా వారి కుటుంబంతో ప్రయాణిస్తున్న కార్యకర్తలు కూడా జడ్పిటిసి ఒక ఎన్నికల సందర్భంగా వెనకడుగు వేశారు.
తెలుగుదేశం పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేసిందని వైసిపి ఆరోపించినా.. కనీసం ఏజెంట్ లను కూడా నిలబెట్టుకోలేకపోవడం ఆ పార్టీ దయనీయ పరిస్థితికి అర్థం పడుతుంది. ఈ క్రమంలో ఆయన మూడు రోజుల పర్యటనలో భాగంగా కేడర్ తో సమావేశం అవుతారా..? వారికి దిశానిర్దేశం చేస్తారా..? కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపుతారా..? అనేది చూడాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోవడానికి ఆయన కార్యకర్తలతో, స్థానిక నేతలతో సమావేశం అవుతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.