వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో సుమారు 4 వేల కోట్ల రూపాయలకు పైగా అక్రమాలు జరిగినట్టు ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అంచనావేశారు. ఈ క్రమంలో పలువురిని అరెస్టు చేసి విచారించారు. ఇంకా, విచారించాల్సిన వారి జాబితా కూడా పెద్దదిగానే ఉంది. మరోవైపు నాటి అక్రమాల్లో ప్రముఖ పాత్ర ఉన్న వారి ఆస్తులను కోర్టు ఆదేశాల మేరకు అటాచ్ చేస్తున్నారు. తాజాగా 441 కోట్ల రూపాయల ఆస్తులను ఎన్ఫోర్స్మెంటు డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అటాచ్ చేశారు.
ఎవరివి?
ఈ 441 కోట్ల రూపాయలు.. మొత్తంగా ముగ్గురు ప్రధాన నిందితులకు చెందన ఆస్తులని ఈడీ అధికారులు తెలిపారు. ఏ-1గా ఉన్న కసిరెడ్డి రాజశేఖరరెడ్డి(గతంలోనే ఈయన ఆస్తులను కొంత మేరకు అటాచ్ చేశారు), బూనేటి చాణక్య, ఐఆర్ఎస్ అధికారి దొంతిరెడ్డి వాసుదేవరెడ్డికి చెందిన 441 కోట్ల రూపాయల ఆస్తులను తాజాగా అటాచ్ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ఆస్తులు అక్రమంగా వారికి చేకూరినట్టు తమకు ఆధారాలు ఉన్నాయని పేర్కొనడం గమనార్హం. దీనిపై కోర్టును ఆశ్రయించి.. కోర్టు ఆదేశాల మేరకు అటాచ్ చేసినట్టు వివరించారు.
ఏంటీ అక్రమం?
వైసీపీ హయాంలో అప్పటి వరకు ఉన్న మద్యం విధానాన్ని సమూలంగా మార్చేశారు. ప్రైవేటు వ్యాపారుల లైసెన్సులు ముగియడంతో ప్రభుత్వమే ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే ప్రముఖ బ్రాండ్ల కంపెనీలను పక్కన పెట్టి.. నాసిరకం బ్రాండ్లను ప్రోత్సహించారు.
దీనిలో వైసీపీకి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. వీరి నుంచి మద్యం కొనుగోలు చేసేందుకు కమీషన్లు ఇవ్వాలని షరతులు విధించారు. దీనిని పక్కాగా అమలు చేశారు. 12 బాటిళ్లు ఉండే కేసుకు 18-20 శాతం మేరకు కమీషన్లు వసూలు చేశారు.
ఈ సొమ్మును 2024 ఎన్నికల్లో వినియోగించారన్నది సిట్ అధికారులు చెబుతున్న మాట. అదేసమయంలో కొంత సొమ్ము.. కీలక నేతకు చేరిందని కూడా అంటున్నారు. అయితే.. ఆ కీలక నేత ఎవరు? అనేది విచారణకు కీలకంగా మారింది.