హైదరాబాద్ : తెలంగాణ ప్రాంతపు అస్తిత్వానికి భంగం కలిగించేలా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శనివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. చారిత్రకంగా హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాలుగా పెద్ద నగరంగా విస్తరించాయని అన్నారు. ఈ రెండు నగరాలు ప్రపంచ వ్యాప్తంగా జంట నగరాలుగా పేరుపొందాయని పేర్కొన్నారు. గతంలో పుస్తకాల్లో తుగ్లక్ గురించి అంతా చదువుకున్నారని, ఇవాళ తుగ్లక్ పాలన అంటే ఎట్లా ఉంటుందో రేవంత్ రెడ్డిని చూసి అర్థం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు కేటీఆర్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పిచ్చోడు చేతిలో రాయిలా మారిందన్నారు.
ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు పాలన చేతకాక చిల్లర రాజకీయాలు చేస్తున్నాడంటూ మండిపడ్డారు కేటీఆర్. హామీల అమలును పక్కనపెట్టి కేవలం పేర్లు మార్చడంపైనే ఫోకస్ పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట టీఎస్ తీసేసి టీజీ అన్నారు. ఆ తర్వాత తెలంగాణ తల్లిని మార్చారు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను తీసేశారు. అధికార చిహ్నం నుంచి కాకతీయ కళా తోరణాన్ని, చార్మినార్ను తీసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. వీటన్నిటి వలన ప్రజలకు ఏమాత్రం లాభం జరిగిందో ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి పిచ్చి పనులు తుగ్లక్ పనులు తప్పించి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు.
ప్రజల దగ్గరికి పాలన పోవాలని, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలని వికేంద్రీకరణను ఒక విశాల దృక్పథంతోనే కేసీఆర్ ఆనాడు ప్రారంభించారని గుర్తు చేశారు కేటీఆర్. ఇందులో భాగంగానే కొత్త గ్రామాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను ఏర్పాటు చేశారని అన్నారు. 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చారని చెప్పారు. హైదరాబాదులోనూ వార్డులను, జోన్లను పెంచడం జరిగిందన్నారు.
వాటికి అభివృద్ధి నిధులను కూడా అధికంగా ఇవ్వడం జరిగిందన్నారు.
The post తెలంగాణ అస్తిత్వానికి భంగం కలిగిస్తే ఊరుకోం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
తెలంగాణ అస్తిత్వానికి భంగం కలిగిస్తే ఊరుకోం
Categories: