అమరావతి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక 20 నెలల్లో 6.28 లక్షల మందికి ఉద్యోగాల కల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఈ మేరకు ఎంఎస్ఎంఈలో 2.48 లక్షలు, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1.46 లక్షలు, పరిశ్రమల్లో 95 వేలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 64 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. మెగా డీఎస్సీ, పోలీసు కానిస్టేబుళ్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు 30,500 కల్పించామని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చామని..అంతకంటే ఎక్కువ ఉద్యోగాలే కల్పించి హామిని నిలబెట్టుకుంటామని ఉద్ఘాటించారు. ఇందుకోసం ఓ కమిటీని కూడా నియమించామని అన్నారు. పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఐటీ, ఉద్యోగాల కల్పన, వైద్య, విద్య తదితర రంగాలపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు.
2019-24 మధ్య ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతిన్నదని అన్నారు. జాకీ, అమర్ రాజా, లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి కంపెనీలు రాష్ట్రాన్ని వదిలిపెట్టి పోయాయని ఆరోపించారు. వైసీపీ ఉన్నంత వరకూ ఏపీకి తిరిగి రామని చెప్పి మరీ ఆ కంపెనీలు వెళ్లిపోయాయని గుర్తు చేశారు. పూర్తిగా నెగెటివ్ ఇమేజ్ని సృష్టించి గత పాలకులు వెళ్లారని అన్నారు. 2019-20 నుంచి 2023-2024 ఆర్ధిక సంవత్సరంలో 913 కంపెనీలు మూతపడినట్టు ఆర్బీఐ నివేదికలో పేర్కొందని వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే చిరునామా ఏపీ ఉండేదన్నారు సీఎం. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు కేరాఫ్ అడ్రస్గా ఏపీ ఉందని చెప్పారు. 26 పాలసీలతో వేగంగా పెట్టుబడులకు అనుమతులు ఇస్తున్నాం అన్నారు. పర్యాటకానికి పారిశ్రామిక హోదా ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు నారా చంద్రబాబు నాయుడు.
The post 20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు కల్పించాం : చంద్రబాబు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు కల్పించాం : చంద్రబాబు
Categories: