పార్లమెంటులో డీలిమిటేషన్ సహా.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించేందుకు.. ఎంతసమయమైనా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఈ వ్యవహారంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజుజు కీలక నిర్ణయం తీసుకున్నారు. సభలో చర్చకు ఎంత సమయమైనా ఫర్వాలేదని.. స్పీకర్ విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అవసరమైతే.. రాత్రివేళల్లోనూ చర్చ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
దీనిపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. సభలో ఒక్కొక్క పార్టీకి 3 గంటల పాటు చర్చకు సమయం ఇస్తున్నామన్నారు. అంతేకాదు.. ఒక పార్టీ తరఫున ఎంత మంది సభ్యులు మాట్లాడాలని అనుకున్నా.. స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు. ఒకవేళ ఒక పార్టీ తరఫున ఒక సభ్యుడే సభకు వస్తే.. ఆ సభ్యుడికి కూడా కావాల్సినంత సమయం ఇస్తామని.. చెప్పారు. బిల్లులపై 15 గంటల నుంచి 22 గంటల వరకు అవకాశం ఉంటుందన్నారు.
అనంతరం.. రేపు(శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. సభ్యులు తమ డిమాండ్లను.. తమ సూచనలు, సలహాలు తెలియజేసేందుకు మహత్తర అవకాశంగా పేర్కొన్నారు. మరోవైపు ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కేస్తున్నారంటూ..పలువురు సభ్యులు చేసిన ప్రకటన నేపథ్యంలో అధికార పక్షం ఇలా సమయం ఇవ్వడం గమనార్హం. సభ్యులు అందరూ మాట్లాడేందుకు అవకాశం ఉంటుందని పేర్కొనడం విశేషం.
ఇదిలావుంటే.. ఇలా .. సభలో భారీ స్థాయిలో సమయం కేటాయించడం అనేది ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. గతంలో మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిన సమయంలో రాత్రివేళల్లో కూడా సభను కొలువుదీర్చారు.
ఆ తర్వాత.. 2023లో మహిళా రిజర్వేషన్ కోసం చేపట్టిన ప్రక్రియపై చర్చించేందుకు కూడా ఇలానే కొంత వెసులుబాటు ఇచ్చారు. అయితే.. వాటికి భిన్నంగా.. ఇప్పుడు పార్టీలకు 3 గంటల చొప్పున కేటాయిస్తామని చెప్పడం ఇదే తొలిసారి. ఏదేమైనా.. సాధించుకోవాలన్న పట్టుదల నేపథ్యంలో కేంద్రం వ్యూహాత్మక అడుగు వేసిందనే చెప్పాలి.