ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై బహుభాషా నటుడు.. ప్రకాష్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు చంద్రబాబు, పవన్లు.. ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ఇది సరికాదన్నారు. వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన వారు.. ఇలా కేంద్రాన్ని గుడ్డిగా సమర్థించడం సరికాదని తేల్చి చెప్పారు. అయితే.. ఇదేసమయంలో వైసీపీ అధినేత జగన్పై పన్నెత్తు మాట అనకపోవడం గమనార్హం.
ఏం జరిగింది?
పార్లమెంటులో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. ఓటింగ్లో అధికార పక్షం 2/3 వంతు ఓట్లను తెచ్చుకోవాలి. కానీ.. సాధించలేక పోయింది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బిల్లు వీగిపోయింది. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు విపక్షాలు తీరని ద్రోహం చేశాయని.. మహిళలకు రిజర్వేషన్ రాకుండా వ్యవహరించాయని దుయ్యబట్టారు.
ఇక, పవన్ కల్యాణ్ కూడా.. ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇది దేశ పురోగతిని అడ్డుకోవడమేనని వ్యాఖ్యానించారు. మహిళలకు దక్కుతున్న చారిత్రక అవకాశాన్ని విపక్షాలు చేజార్చాయని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ప్రకాష్రాజ్ ఇద్దరినీ టార్గెట్ చేయడం గమనార్హం. కానీ.. ఇదేసమయంలో ఈ బిల్లు వీగిపోవడంపై జగన్కూడా.. తీవ్ర వ్యాఖ్యలే చేశారు. `ప్రతిపక్షాలు దీనిని వ్యతిరేకించడం ద్వారా ఏం సాధించాయో చెప్పాలి“ అని నిలదీశారు.
అంతేకాదు.. పలు గణాంకాలతోనూ జగన్.. మహిళలకు ఒనగూరే ప్రయోజనాలను వివరించారు. మరి జగన్ను ఎందుకు కార్నర్ చేయలేదన్నది ప్రశ్న. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే ఆమోదం పొందిందని, దాన్ని ఎప్పుడైనా అమలు చేయవచ్చని ప్రకాష్ రాజ్ గుర్తుచేశారు.
“ఏపీ ప్రజలు మిమ్మల్ని సీఎం, డిప్యూటీ సీఎంను చేశారు. వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి“ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. చర్చకు కూడా సిద్ధమని సవాల్ రువ్వారు. అయితే.. జగన్ కూడా వ్యతిరేకించారు కదా.. మరి ఆయన నచ్చారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.