ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి శనివారం సాయంత్రం సామాజిక మాధ్యమాల్లో ఒక్కసారిగా పెద్ద చర్చ మొదలైంది. ఉన్నట్లుండి ఆయనకు శస్త్రచికిత్స జరిగిందనే వార్తతో అభిమానులు ఉలిక్కిపడ్డారు. ఈ విషయమై జనసేన పార్టీ తరఫున అధికారిక ప్రకటన ఇచ్చారు.
శుక్రవారం అధికారులతో మాట్లాడుతున్న సమయంలో పవన్ అస్వస్థతకు గురయ్యారని.. పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనకు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించారని.. ఆ ప్రకారమే శనివారం సాయంత్రం సర్జరీ జరిగిందని ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. శస్త్రచికిత్స నుంచి కోలుకుని రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొనడానికి పది రోజులు పడుతుందని పేర్కొంటూ.. ఆయన పూర్తి ఆరోగ్యం సంతరించుకోవడానికి చాలా రోజులు పడుతుందని ప్రస్తావించడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది.
ఐతే పవన్కు అస్వస్థత, శస్త్రచికిత్స అన్నారే తప్ప.. అసలు ఆయనకు తలెత్తిన ఆరోగ్య సమస్య ఏంటి అన్నది మాత్రం ఎక్కడా పేర్కొనలేదు. ఈ వార్తను రిపోర్ట్ చేసిన మీడియా సంస్థలు సైతం ప్రెస్నోట్ ఆధారంగానే న్యూస్ ఇచ్చాయి తప్ప.. అదనపు సమాచారం లేదు. అందరూ సర్జరీ సర్జరీ అనడమే తప్ప అసలు అదేం సర్జరీ అన్నది మాత్రం చెప్పట్లేదు.
అసలీ విషయం ప్రస్తావించకుండా ప్రెస్ నోట్ ఇవ్వడమేంటో పవన్ అభిమానులకు అర్థం కావడం లేదు. ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేని పరిస్థితి ఎందుకొచ్చింది.. అసలు పవన్కు ఏమైంది అని వారు ఆందోళన చెందుతున్నారు.
పవన్కు దీర్ఘ కాలంగా వెన్ను నొప్పి సమస్య ఉన్న విషయం తెలిసిందే. ఒక దశలో ఆయన ఎక్కువసేపు నిలబడలేని, కూర్చోలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. మరి ఇప్పుడు సర్జరీ కూడా దానికి సంబంధించే జరిగిందా.. లేక వేరే ఏదైనా సమస్య తలెత్తిందా అన్నది అర్థం కావడం లేదు. కోలుకున్నాక మీడియా ప్రతినిధులను కలిసినపుడు పవనే ఈ విషయం వెల్లడిస్తాడేమో చూడాలి.