తెలంగాణ రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలంటూ.. తొలి దశలో చేపట్టిన ఉద్యమం ఒక చరిత్రగా మిగిలిపోగా.. మలి దశ ఉద్యమాన్ని భుజానికెత్తుకున్న తెలంగాణ రాష్ట్రసమితి- టీఆర్ ఎస్..మరో చరిత్రను సృష్టించింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. అయితే.. దీనిలో సబ్బండ వర్గాల నుంచి ఉన్నత స్థాయి వరకు అందరిపాత్రా ఉంది. అయితే.. దండలో దారంలా వీరందరినీ కలిపిన ఏకైక పార్టీ తెలంగాణ రాష్ట్రసమితి!.
2001, ఏప్రిల్ 27న ప్రారంభమైన టీఆర్ ఎస్ ప్రస్థానం.. మధ్యలో బీఆర్ ఎస్గా మారి.. నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ పాతికేళ్లలో రెండు సార్లు అధికారంలోకి కూడా వచ్చిన ఈ పార్టీ.. ప్రస్తుత పరిస్థితి ఏంటి? భవిష్యత్తు ఏంటి? అనేదే ఇప్పుడు ప్రధాన చర్చ. తెలంగాణ పౌరులను ఒకప్పుడు.. సెంటిమెంటు అస్త్రంతో ముడి వేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. నిధులు-నీళ్లు-నియామకాలను ప్రధాన ఆయుధంగా మలుచుకున్నారు. ఇంటికొకరు చొప్పున కాదు.. ఇంటిల్లిపాదీ ఉద్యమంలో పాల్గొనేలా తనదైన వాగ్బాణాలు సంధించి.. తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపారు.
కానీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. నిధులు-నీళ్లు-నియామకాల విషయంలో జరిగిన తేడా.. అదే కేసీ ఆర్ అస్తిత్వాన్ని ప్రశ్నించేలా చేసింది. దీనికితోడు కుటుంబ పాలన.. కుటుంబ పార్టీ అనే రెండు ముద్రలు ఐఎస్ ఐముద్రలాగా టీఆర్ ఎస్ను ఇప్పటికీ వేధిస్తున్నాయి. ఈ పరిణామాల క్రమంలోనే కుటుంబం నుంచి బయటకు వచ్చిన సొంత బిడ్డ కవిత.. వేరు కుంపటి పెట్టుకుని.. అస్త్రాలు సంధిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాళోజీ నారాయణరావు చెప్పినట్టు.. ప్రశ్నించే ఒక గొంతును చిదిమేస్తే.. లక్షలాది గొంతుకలు విచ్చుకుంటాయన్న ధోరణి.. కేసీఆర్ విషయంలో స్పష్టమైంది.
ముందుంది ఏంటి?
ప్రస్తుత పరిస్థితిలో బీఆర్ ఎస్ రాజకీయ పార్టీగానే మిగిలిపోయిందన్న వాదనను తుడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. ఉద్యమ సమయంలో ఎలా అయితే.. సమస్యలపై గళం విప్పారో.. ఏ బడుగుల కోసం.. ఏ సబ్బండ వర్గాల కోసం కట్టుబడి ఉన్నమన్న కేసీఆర్.. అదే వర్గాల కోసం.. నేడు నడుంబిగించాల్సిన అవ సరం ఉంది. కుటుంబ పార్టీ ముద్రను తుడిచి పెడుతూ.. సమాజ పార్టీగా బీఆర్ ఎస్ను మార్చగలిగితేనే నేడు ఆ పార్టీకి భవిత.. రానున్న రోజుల్లో నవత కనిపిస్తాయనడంలో సందేహం లేదు. ఊరూవాడా జెండాలు ఎగరడం బాగున్నా.. అంతకుమించి.. ఏదో ఆశిస్తున్న సమాజాన్ని అక్కున్న చేర్చుకోవాల్సిన అవసరం పార్టీకి ఎంతైనా ఉంటుందనడంలో సందేహం లేదు!!