మధ్యప్రదేశ్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు న్యూస్ పేపర్ ముక్కల్లో మధ్యాహ్న భోజనం తింటున్న ఓ వీడియోను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్లో షేర్ చేశారు. షియోపూర్ జిల్లా హల్పూర్ గ్రామంలోని ఓ మాధ్యమిక పాఠశాలలో ఈ ఘటన వెలుగుచూసింది. బడి కాంపౌండ్లో చెత్తాచెదారం మధ్య పిల్లలు వరుసగా కూర్చొని న్యూస్ పేపర్ ముక్కల్లో ఉన్న ఆహారాన్ని తింటున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
వీడియోలోని దృశ్యాలను చూసి తన హృదయం ముక్కలైందని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను చూసి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి సిగ్గుపడాలన్నారు. దేశ భవిష్యత్తు అయిన… ఏ పాపం ఎరుగని చిన్నారులకు కనీసం ప్లేట్లలో భోజనం చేసే గౌరవం కూడా దక్కకూడదా? అంటూ రాహుల్ హిందీలో ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్ను 20 ఏళ్లకు పైగా ఏలుతున్న బీజేపీ… చిన్నారుల కంచాలను కూడా దొంగిలించిందని ఆరోపించారు. ఇలా చిన్నారుల భవిష్యత్తును నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తున్నందుకు మధ్యప్రదేశ్ సీఎం, ప్రధాని మోదీ సిగ్గుపడాలి అని రాహుల్ మండిపడ్డారు. పీఎం పోషణ్ పథకం కింద ఓ స్వయం సహాయక బృందానికి హల్పూర్ పాఠశాలలో పిల్లలకు మధ్యాహ్న భోజనం వడ్డించే కాంట్రాక్టును అప్పగించారు. తాజా వీడియో నేపథ్యంలో జిల్లా కలెక్టర్, సదరు స్వయం సహాయక బృందాన్ని ఆ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులు శనివారం ఈ పాఠశాలకు స్టీల్ ప్లేట్లను పంపించారు.
రాహుల్ దుకాణం మూతపడుతుంది – అమిత్ షా
బిహార్ శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ దుకాణం మూత పడుతుందని, విపక్ష ఇండియా కూటమి తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఇప్పటికే సగం రాష్ట్రంలో ఆ కూటమికి తలుపులు మూసేశారని, 160కి పైగా సీట్లు గెలుచుకుని ఎన్డీయే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. శనివారం బిహార్లోని పూర్ణియా, కటిహార్, సుపాల్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. రాహుల్, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ కలిసి బిహార్లోని సీమాంచల్ ప్రాంతాన్ని నరకప్రాయం చేశారని, అక్రమ వలసదారుల్లో ప్రతి ఒక్కర్ని కేంద్రం గుర్తించి.. వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించి.. వెనక్కి పంపడం ఖాయమని పేర్కొన్నారు.
లాలూలా మోదీ స్కాంలు చేయలేరు
ఏడు జన్మలెత్తినా లాలూ మాదిరి కుంభకోణాలను ప్రధాని మోదీ చేయలేరని అమిత్షా చురకలంటించారు. ‘లాలూ రైల్వేలో చేసిన అవినీతిని దేశం మరచిపోలేదు. కానీ మోదీ ప్రజల కోసం పనిచేస్తున్నారు, దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారు’ అని తెలిపారు.
The post Mid Day Meal: న్యూస్ పేపర్లో పిల్లలకు మధ్యాహ్న భోజనం ! appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Mid Day Meal: న్యూస్ పేపర్లో పిల్లలకు మధ్యాహ్న భోజనం !
Categories: