కర్ణాటక రాజధాని బెంగళూరులో పట్టపగలు నడిరోడ్డుపై భారీ దొంగతనం జరిగింది. పన్ను అధికారులమంటూ వచ్చిన దుండగులు… ఏటీఎంలో డబ్బులు నింపే క్యాష్ వ్యాన్ ను అడ్డగించి ఏడు కోట్ల రూపాయలతో పరారీ అయ్యారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
బెంగళూరులోని జేపీ నగర్లో ఉన్న ఒక ప్రైవేటు బ్యాంక్ బ్రాంచ్ నుంచి క్యాష్ వ్యాన్లో ఏటీఎంకు నగదు తరలిస్తున్నారు. ఆ వ్యాన్ అశోకా పిల్లర్ ప్రాంతంలో ఉండగా.. అకస్మాత్తుగా ఒక కారు అడ్డుగా వచ్చింది. అందులో వ్యక్తులు నగదు ఉన్న వాహనం వద్దకు వచ్చి… పన్ను విభాగ అధికారులమని, పత్రాలు చూపించాలని హడావుడి చేశారు. వ్యాన్ సిబ్బంది స్పందించేలోపే.. వారిని, డబ్బును కారులోకి బలవంతంగా ఎక్కించారు. కొంతదూరం కారుపోనిచ్చి, ఆ సిబ్బందిని బలవంతంగా దింపేశారు. తర్వాత ఆ డబ్బుతో పరారయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపడుతున్నాయి. సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నాయి. కరడుగట్టిన దోపిడీ ముఠాలు దీనివెనక ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
గుజరాత్ లో బ్యాంకు ముందు బారులు తీరిన జనం
కొన్నేళ్ల క్రితం రద్దయిన రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి దేశవ్యాప్తంగా బ్యాంకుల ముందు జనాలు బారులు తీరిన దృశ్యాలు ఇప్పటికీ చాలామందికి గుర్తే. ఇప్పుడు అలాంటి ఒక సన్నివేశమే గుజరాత్లోని మెహసానాలో కనిపించింది. అక్కడి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ బయట పొడవాటి క్యూలు కనిపించాయి. వారు అలా ఒక్కసారిగా బ్యాంక్ దగ్గరకు రావడం వెనక గల కారణం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
ఆర్బీఐ ఆదేశాల ప్రకారం.. మెహసానా కోఆపరేటివ్ బ్యాంక్ ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసి, కొత్తగా ముద్రించిన రూ.10 నోట్లు, నాణేలను జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్దస్థాయిలో శిబిరానికి వచ్చారు. ఉదయం నుంచే వందలమంది లైన్లలో నిల్చున్నారు. తమవంతు వచ్చే వరకు ఓపికగా వేచిచూశారు. స్థానిక వ్యాపారులు, ఇతరుల డిమాండ్ మేరకు తక్కువ విలువ కలిగిన కరెన్సీ కొరతను పరిష్కరించే ఉద్దేశంతో బ్యాంక్ ఈ క్యాంప్ను ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా రూ.14 లక్షల విలువైన రూ.10 నోట్లు, కొన్ని రూ.20 నోట్ల కట్టలు, రూ.3లక్షల విలువైన రూ.2, రూ.5 నాణేలను బ్యాంక్ అధికారులు జారీ చేశారు.
ఉదయం పది గంటల మొదలైన ఈ డ్రైవ్.. సాయంత్రం వరకు కొనసాగింది. రోజూవారీ ఖర్చులకు చిల్లర లేదని, పిల్లల అవసరాలు, ఇంట్లో వివాహ కార్యక్రమాలు ఉన్నాయని, తమ వద్ద ఉన్న నోట్లు చిరిగిపోయాయని.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో కారణంతో బ్యాంక్కు వచ్చారు. నగదు లభ్యతను అందుబాటులో ఉంచేందుకు ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా తాము వ్యవహరించామని క్యాంప్ గురించి బ్యాంక్ మేనేజర్ ముకేశ్ భాయ్ పటేల్ మీడియాకు వెల్లడించారు.
The post Robbery in Bengaluru: బెంగుళూరులో క్యాష్ వ్యాన్ ను లూటీ చేసి రూ.7 కోట్లతో పరారీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Robbery in Bengaluru: బెంగుళూరులో క్యాష్ వ్యాన్ ను లూటీ చేసి రూ.7 కోట్లతో పరారీ
Categories: