తన తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ లతో మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కొద్ది రోజులుగా దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. సొంత పార్టీపై, కేసీఆర్ నాయకత్వంపై, కేటీఆర్ పై, హరీష్ రావుపై కవిత తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే, తాజాగా కేసీఆర్ పేరెత్తేందుకు కూడా కవిత ఇష్టపడని వైనం హాట్ టాపిక్ గా మారింది. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి నేటికి 16 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా తన తండ్రి కేసీఆర్ పేరు ప్రస్తావించకుండా ఒక యోధుడి దీక్ష వల్ల తెలంగాణ వచ్చిందంటూ కవిత చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.
ఈ క్రమంలోనే కవితపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ యోధుడి పేరెత్తేందుకు కూడా కవిత ఇష్టపడడం లేదని, కానీ, ఆయన వల్లే కవిత ఇన్నాళ్లూ పదవులు అనుభవించిన విషయాన్ని మరిచిపోయారని ఎద్దేవా చేస్తున్నారు. కేసీఆర్ లేకుండా కవిత ఉనికి లేదని, అటువంటి నాయకుడిని సొంత కూతురైన కవిత విస్మరించడం ఏంటని మండిపడుతున్నారు. కేసీఆర్ పై ఎంతోమంది ప్రశంసలు కురిపిస్తుంటే కన్న కూతురు మాత్రం ఈ రకంగా అవమానిస్తోందని అంటున్నారు.
కేసీఆర్ ఫొటో లేకుండా కవిత ఎక్స్ లో చేసిన పోస్ట్ ట్రెండ్ అవుతోంది. కేసీఆర్ ఇమేజ్ లేకుండా కవిత పోస్ట్ చేశారని, కానీ, ఇన్నాళ్లూ ఆయన ఇమేజ్ వాడుకొని కవిత రాజకీయల్లో ఎన్నో పదవులు చేపట్టారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కవితకు సొంతగా ఇమేజ్ ఉందనుకుంటే రాబోయే ఎన్నికల్లో సొంతగా తెలంగాణ జాగృతి తరఫున పోటీ చేసి గెలవాలని నెటిజన్లు సవాల్ విసురుతున్నారు.
ఒక యోధుని దీక్ష అమరుల త్యాగం యావత్ తెలంగాణ ..జాతికి మేలుకొలుపైంది ..ఐక్యతా గీతమైంది ..ఉద్యమ స్ఫూర్తిని నింపింది తెలంగాణ ఉద్యమాన్ని విజయపథం వైపు నడిపింది !!!రాష్ట్ర సాధనకు దారి దీపమైంది !!!భౌగోళిక తెలంగాణ సాధించాం !!సామాజిక తెలంగాణ సాధిస్తాం !!జై…— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 29, 2025