తిరుపతి : నిత్య జీవితంలో సత్యం, దయ, క్షమ వంటి సద్గుణాలను ఆచరించడం ద్వారా మనిషి జీవితం సార్థకం అవుతుందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో నిర్వహించిన ధార్మికోపన్యాస కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిత్య జీవితంలో ధర్మాచరణం అనే అంశంపై ఉపన్యసించారు. కాలానుగుణంగా ధర్మంలో మార్పులు వచ్చినా సత్యం ఎప్పటికీ నిలకడగా ఉంటుందని అన్నారు.
సత్యం, అహింస, దయ, క్షమ, సహనం వంటి గుణాలు ధర్మానికి మూలాధారాలని, ఇవే మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని చెప్పారు చాగంటి కోటేశ్వర్ రావు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ భగవంతుని సాన్నిధ్యం తప్పక ఉంటుందని అన్నారు. శ్రీరాముడు ధర్మానికి ప్రతీకగా నిలిచిన మహానుభావుడని కొనియాడారు. ఆయనను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో ధర్మాచరణకు పెద్దపీట వేయాలని సూచించారు చాగంటి కోటేశ్వర్ రావు. ముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించడం, గురువులను స్మరించడం, పెద్దలను ఆదరించడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం మన బాధ్యత అని స్పష్టం చేశారు .
సనాతన ధర్మంలో తల్లికి అత్యున్నత స్థానం ఉందని, తల్లిని ప్రేమగా చూసు కోవడం, సేవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని అన్నారు. అలాగే గోసేవ సనాతన ధర్మానికి ప్రాణ స్వరూపం అని పేర్కొన్నారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్ రావు. ప్రతి ఒక్కరూ గోవులను సంరక్షించి సేవించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ధర్మాచరణలో ఓర్పు ముఖ్యమైన గుణమని, ఓర్పును మించిన ధర్మం లేదని చెప్పారు. శ్రీవేంకటేశ్వర స్వామివారు క్షమాగుణంతో భక్తులపై అపార కరుణ చూపుతున్నారని పేర్కొన్నారు.
The post తల్లిదండ్రులను గౌరవించడం నిజమైన సంస్కారం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
తల్లిదండ్రులను గౌరవించడం నిజమైన సంస్కారం
Categories: