ఆదివారం(ఏప్రిల్ 19) వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ పుట్టిన రోజు. ఆమె తాజాగా 70 ఏళ్ల వయసులోకి అడుగు పెట్టారు. అయితే.. విజయమ్మ కుమారుడు, మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్.. ఆమెకు శుభాకాంక్షలు తెలపకపోవడం గమనార్హం. ఈ విషయం రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. కానీ, ఇదేసమయంలో మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మాత్రం విజయమ్మకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక, విజయమ్మ కుమార్తె, ఏపీపీసీసీ అధ్యక్షురాలు.. షర్మిల తన పాత ఫొటోను పోస్టు చేసి.. అమ్మకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పలువురు విజయమ్మకు శుభాకాంక్షలు చెప్పారు. ఇంత జరుగుతున్నా.. జగన్ మాత్రం ఎక్కడా తన తల్లికి శుభాకాంక్షలు చెప్పకపోవడం.. ఇదేసమయంలో ఆ పార్టీతోను.. ఆ కుటుంబంతోనూ విభేదించే నారా లోకేష్ శుభాకాంక్షలు చెప్పడం అందరూ మెచ్చుకుంటున్నారు.
కుటుంబ ఆర్థిక విషయాలు.. ఇటీవల ఆస్తుల విషయంపై విజమ్మ రాసిన బహిరంగ లేఖ.. వంటివి వైసీపీ అధినేత జగన్ను ఇంకా బాధిస్తున్నట్టు తెలుస్తోందని పలువురు నెటిజన్లు చెబుతున్నారు. అయినప్పటికీ .. కన్నతల్లి పుట్టిన రోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు చెప్పకపోవడం.. దారుణమని.. ఆయన నైజాన్ని చాటి చెబుతోందని పలువురు పేర్కొన్నారు. దీనిపై మిశ్రమ స్పందన కనిపించింది. కొందరు ఇది కుటుంబ వ్యవహార మని వ్యాఖ్యానించారు.
పవన్ కోలుకోవాలని..
మరోవైపు.. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ముక్కు ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసు కుంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఆయనకు తన ఎక్స్ వేదికగా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. దీనికి ఉపముఖ్యమంత్రి కార్యాలయం బదులిచ్చింది. జగన్కు ధన్యవాదాలు తెలిపింది. ఇక, మరోవైపు.. ప్రధాని మోడీ కూడా.. పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.