hyderabadupdates.com Gallery CM Revanth Reddy: కేసీఆర్‌, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉంది – సీఎం రేవంత్‌

CM Revanth Reddy: కేసీఆర్‌, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉంది – సీఎం రేవంత్‌

CM Revanth Reddy: కేసీఆర్‌, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉంది – సీఎం రేవంత్‌ post thumbnail image

 
 
కేసీఆర్‌, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కేసీఆర్‌కు లొంగకపోతే, రెండు పార్టీల మధ్య ఫెవికాల్‌ బంధం లేకపోతే జూబ్లీహిల్స్‌ పోలింగ్‌ తేదీలోగా కాళేశ్వరం కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని, కేసీఆర్‌, హరీశ్‌లను అరెస్టు చేయాలని సవాల్‌ విసిరారు. ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో 50 కోట్ల రూపాయలు ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో కంపెనీ నుంచి వసూలు చేశారని, ఆధారాలతో సహా ఏసీబీ కేసు కట్టి కేటీఆర్‌ను అరెస్టు చేయడానికి అనుమతి అడిగితే రెండు నెలల నుంచి గవర్నర్‌ వద్ద ఫైల్‌ ఆగిపోయిందని ప్రస్తావించారు. కేటీఆర్‌ను అరెస్టు చేసేందుకు ఎందుకు అనుమతివ్వడం లేదని ప్రశ్నించారు.
 
‘‘మీ గూడుపుఠాణీ ఏంది? ఈ ఎన్నికల్లో మీరు ఆత్మహత్య చేసుకొని బీఆర్‌ఎస్ ను గెలిపించాలని కుట్ర చేస్తలేరా? ఎందుకంటే రేపు బీఆర్‌ఎస్‌ బీజేపీలో విలీనమవుతుంది. ఇదీ నేను చెప్పలేదు. కేటీఆర్‌ సొంత చెల్లెలుచెప్పింది. విలీనానికి తాను ఒప్పుకోలేదు కాబట్టే పార్టీలో నుంచి బయటకు వెళ్లగొట్టారని చెబుతోంది. కారు స్టీరింగ్‌ మోదీ చేతిలో ఉంది’’ అని ముఖ్యమంత్రి అన్నారు. మంగళవారం రాత్రి ఆయన జూబ్లీహిల్స్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌తో కలిసి రహమత్‌నగర్‌ డివిజన్‌ ఎస్‌పీఆర్‌ హిల్స్‌ నుంచి రోడ్డు షో నిర్వహించారు. శ్రీరామ్‌నగర్‌ క్రాస్‌రోడ్డు కార్నర్‌ మీటింగ్‌లో ప్రసంగించారు.
 
‘‘గతంలో రాష్ట్రంలో పర్యటనకు వచ్చినపుడల్లా మోదీ, అమిత్‌షాలు కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్‌ఎస్ కు ఏటీఎంగా మారిందని, లక్షల కోట్లు కొల్లగొట్టారని చెప్పారు. కాళేశ్వరం కట్టడం, కూలడం మూడేళ్లలో జరిగిపోయింది. లక్ష కోట్లు గోదావరిలో కలిసిపోయాయి. దాని మీద వేసిన జ్యూడిషియల్‌ కమిషన్‌ కేసీఆర్‌, హరీశ్‌లు దోషులని, వారిపై చర్యలు తీసుకోవాలని నివేదికిస్తే ఆ విషయాన్ని అసెంబ్లీలో చర్చించి సీబీఐకి కేసు అప్పగించాం. సెప్టెంబరు ఒకటిన కేసును కేంద్రం చేతిలో పెట్టాం. అంతకుముందు కిషన్‌రెడ్డి కాళేశ్వరం కేసు మాకివ్వండి, సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో తండ్రీకొడుకులను చంచల్‌గూడ జైలుకు పంపిస్తామన్నారు. సీబీఐకి ఇచ్చిన తర్వాత ఎందుకు అరెస్టు చేయట్లేదు?’’ అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.
 
సాంప్రదాయన్ని తుంగలో తొక్కిందే బీఆర్‌ఎస్‌
ఎవ్వరైనా ఎమ్మెల్యే చనిపోతే ఆ కుటుంబానికి ఏకగ్రీవం ఇచ్చే సంప్రదాయన్ని తుంగలో తొక్కి ఉప ఎన్నిక తీసుకొచ్చిందే బీఆర్‌ఎస్‌ అని రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘పాలేరులో రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, నారాయణ్‌ఖేడ్‌లోకృష్ణారెడ్డి చనిపోయినపుడు వాళ్ల కుటుంబ సభ్యులకు టికెట్‌ ఇస్తే కేసీఆర్‌ వారికి వ్యతిరేకంగా అభ్యర్థులను నిలిపి ఓడించలేదా? తండ్రీ కొడుకులను అడుగుతున్నా? నాడు మీకో నీతి, ఈనాడు మాకో నీతా?’’ అని ప్రశ్నించారు. ‘‘మీ జాతికి నీతి ఉందా? ఉంటే ఆనాడు పీజేఆర్‌ మీద పోటీ పెట్టిన్నందుకు ఎస్పీహిల్స్‌ కాలనీలో ముక్కు నేలకు రాయాలి. ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత ఓట్లు అడగాలి’’ అన్నారు. పీజేఆర్‌ కుటుంబాన్ని ఏకగీవ్రం చేసేందుకు ఆనాడు చంద్రబాబు ప్రయత్నిస్తే కేసీఆర్‌ పోటీ పెట్టారని చెప్పారు. ఆడబిడ్డను ఆదుకోండి. కన్నీటిని తుడవాలని చెబుతున్న కేటీఆర్‌ తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్ని ఇంట్లో నుంచి గెంటేశాడన్నారు. నీచుడు, దుర్మార్గుడు, లాలూచీ ఉన్నోడు ఎవ్వడైనా ఉన్నడంటే తనేనన్నారు.
‘‘తెలంగాణను తండ్రి దోచుకున్న ఆస్తిలో చారానా వాటా సొంత చెల్లెలుకు ఇస్తే తిడుతుందా? ఇయనే మహిళా సెంటిమెంట్‌ గురించి మాట్లాడుతున్నారు’’ అని దుయ్యబట్టారు. ‘‘ఇంట్లో ఆడబిడ్డను చూసుకోలేదు. రాష్ట్రంలో రెండు కోట్ల మంది ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే ఓర్వలేరు’’ అని వ్యాఖ్యానించారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ ఉచిత బస్సు ప్రయాణం ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఆడబిడ్డలు గజ్వేల్‌లో ఫామ్‌హౌస్‌ అడిగారా? జన్వాడలో రెండు ఎకరాలు అడిగారా? పేదలకు పదేళ్లలో రేషన్‌కార్డు ఎందుకు ఇవ్వలేదు? సన్నబియ్యం, ఉచిత కరెంటు, ఉచిత బస్సు రద్దు చేయనికి బీఆర్‌ఎ్‌సను గెలిపించాలా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
 
కేటీఆర్‌ గల్లీలకు వచ్చి ఇక్కడ చెత్త ఏంది? మట్టి ఏందీ అంటున్నారని, ఆ చెత్తనా కొడుకే పదేళ్లు మున్సిపల్‌ మంత్రిగా ఉన్నారని ముఖ్యమంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ సర్వ దరిద్రాలకు, సర్వ రోగాలకు వాడే కారణం కాదా? అని ప్రశ్నించారు. కేటీఆర్‌ను మున్సిపల్‌ చెత్తకుండీదగ్గర ఒక రోజంతా కట్టేస్తే తెలుస్తుందని అన్నారు. ‘‘బలిసి బెంజి కార్లలో తిరిగిండు, కారు షెడ్డుకు పోగానే బిల్లా, రంగాలు ఆటోలో గల్లీలు తిరిగి ఏ ఇల్లు కొల్లగొడదామా? అని చూస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌, మున్సిపల్‌ మంత్రిగా కేటీఆర్‌ హైదరాబాద్‌కు ఏం తెచ్చారో చెప్పాలని అడిగారు. ‘‘శిల్పారామం కాంగ్రెస్‌ హయాంలో కట్టిస్తే ఈ సన్నాసి పోయి సెల్పీలు దిగుతుండు.
 
హైటెక్‌ సిటీ మేము కడితే ఇదీ చూడుర్రంటూ బొమ్మలు దిగుతుండు. బొమ్మలు దిగనికి ఉన్నవా? పదేళ్లు మంత్రిగా ఏమీ తేకుండా గాడిద పళ్లు తోమినవా? మేం హైటెక్‌ సిటీ కడితే, ఔటర్‌ రింగ్‌ రోడ్డు వేస్తే, మెట్రో రైలు తీసుకొస్తే, అంతర్జాతీయ విమానాశ్రయం కడితే, ఐటీ, ఫార్మా కంపెనీలు తీసుకొస్తే కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ ఏం తెచ్చారు? జన్వాడలో వంద ఎకరాల్లో కేటీఆర్‌, గజ్వేల్‌లో వెయ్యి ఎకరాలో కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌ కట్టుకుండ్రు. మెయినాబాద్‌లో 50 ఎకరాల్లో హరీశ్‌రావు ఫామ్‌హౌజ్‌ కట్టుకుండు. కవిత శంకర్‌పల్లి దగ్గర ఫామ్‌హౌజ్‌లు కట్టుకున్నారు. ఇవన్నీ అబద్ధమని కేటీఆర్‌ను చెప్పమనండి.. ఎక్కడ్నుంచి వచ్చింది ఈ సొమ్ము? రబ్బరు చెప్పులు లేనోళ్లకు వందల ఎకరాల్లో ఫామ్‌హౌజ్‌లు ఎవ్వనయ్య జాగీరు? ఏడికెళ్ళి సంపాదించిర్రు?’’ అని ప్రశ్నించారు.
 
జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఓటేసిన 97 మంది
జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఓటింగ్‌ ఈ నెల 11వ తేదీన జరగనుండగా 97 మంది ఓటర్లు ముందస్తుగానే మంగళవారం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 85 ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు, దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే సౌకర్యాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక సందర్భంగా హోం ఓటింగ్‌కు 103 మంది దరఖాస్తు చేసుకోగా, ఈ నెల 4, 6వ తేదీల్లో రెండు విడతలుగా హోం ఓటింగ్‌ జరిపేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. మంగళవారం భారీ పోలీసు బందోబస్తు మధ్య 97 మంది ఓటర్లు ఇంటి వద్దనే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఉదయం 7 గంటలకే హోం ఓటింగ్‌ జరిపే నివాసాల వద్ద పోలింగ్‌ బూత్‌ ఎలా ఉండాలో అలాంటి సౌకర్యాలన్నీ కల్పించారు. స్థానిక పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఇంటి వద్ద సాయుధ బలగాలను మోహరించారు. నియోజకవర్గ ఎన్నికల అధికారి రజనీకాంత్‌రెడ్డితో పాటు ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు పర్యవేక్షించారు. మిగతా వారు ఈ నెల 6వ తేదీన హోం ఓటింగ్‌లో పాల్గొననున్నారు. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఒకే రోజు 97 మంది హోం ఓటింగ్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి.
ఇద్దరు ఓటర్ల మృతి
హోం ఓటింగ్‌లో పాల్గొనేందుకు నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకున్న 80 సంవత్సరాల పైబడిన సీనియర్‌ సిటిజన్స్‌లో ఇద్దరు ఓటింగ్‌కు ముందే మృతి చెందారు. మంగళవారం ఎన్నికల అధికారులు, సిబ్బంది దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లగా మూడు రోజుల క్రితం ఒకరు, వారం రోజుల క్రితం మరొకరు మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు. హోం ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఓటింగ్‌లో పాల్గొనకుండానే వీరు మృతి చెందడం పట్ల అధికారులు కూడా కొంత ఆవేదనకు గురయ్యారు.
The post CM Revanth Reddy: కేసీఆర్‌, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉంది – సీఎం రేవంత్‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Indigo: రూ.8 వేలకే విజయవాడ-సింగపూర్‌ ఫ్లైట్ సర్వీస్ !Indigo: రూ.8 వేలకే విజయవాడ-సింగపూర్‌ ఫ్లైట్ సర్వీస్ !

  విమాన ప్రయాణాలు చేసే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్. విజయవాడ-సింగపూర్‌ మార్గంలో నవంబర్‌ 15 నుంచి ఇండిగో సంస్థ తన కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సర్వీసును ప్రారంభించనుంది. ఈ సర్వీస్‌ మొదలైతే విజయవాడ నుంచి సింగపూర్‌ వెళ్లాలనుకునే ప్రయాణికులకు

Nara Lokesh: గూగుల్ పై తమిళనాడులో జరుగుతున్న రచ్చపై స్పందించిన మంత్రి లోకేష్Nara Lokesh: గూగుల్ పై తమిళనాడులో జరుగుతున్న రచ్చపై స్పందించిన మంత్రి లోకేష్

    గూగుల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. గూగుల్ కంపెనీ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతోంది. కొద్దిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ వైజాగ్‌లో డేటా